
కర్ణాటక: మధ్యాహ్నం భోజనం పథకంలో ఫుడ్ పాయిజనింగ్..
20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా దాదాపు 20 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka) రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్ తాలూకాలోని జమాలాపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజన పథకం(Midday meal)లో భాగంగా మంగళవారం విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆహారం తిన్న కాసేపటికి వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. కొంతమంది కడుపు నొప్పితో బాధపడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా 58 మంది విద్యార్థులను ఔరాద్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. కేవలం 20 మంది పిల్లలకు మాత్రమే వాంతులు, విరేచనాల లక్షణాలు కనిపించాయని, వారికి చికిత్స జరుగుతోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు చెబుతున్నారు. ఐదారుగురు మాత్రం అబ్జర్వేషన్లో ఉన్నారు." అని ఆయన చెప్పారు
ప్రస్తుతం పిల్లల పరిస్థితి బాగానే ఉందని బీదర్ డిప్యూటీ కమిషనర్ శిల్పా శర్మ చెప్పారు. ఆహారం నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

