హర్యానాలో జల కాలుష్యం..
x

హర్యానాలో జల కాలుష్యం..

పల్వాల్‌లో 15 రోజుల్లో 12 మంది మృతి


Click the Play button to hear this message in audio format

హర్యానా రాష్ట్రంలో జల కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పల్వాల్ జిల్లాలో అనుమానిత హెపటైటిస్ వ్యాప్తి కారణంగా గత 15 రోజుల్లో కనీసం 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మరణాలకు కలుషిత తాగునీరు కారణమై ఉండొచ్చని ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రస్తుతం అధికారుల విచారణ కొనసాగుతోంది.

పల్వాల్ జిల్లా చయాన్సా గ్రామంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 5,700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో జనవరి చివరి వారంలో జాండిస్, కాలేయ సమస్యలతో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది పరిస్థితి విషమించి మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు గ్రామానికి చేరుకుని మెడికల్ క్యాంపులు, ఇంటింటి సర్వేలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..జనవరి 27 నుంచి ఫిబ్రవరి 11 మధ్య ఏడు మరణాలు నమోదయ్యాయి. వాటిలో నాలుగు మరణాలు తీవ్రమైన హెపటైటిస్ లేదా కాలేయ వైఫల్యంతో సంభవించినట్లు గుర్తించారు. బాధితుల వయసు 9 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఉన్నారు. అనేక మందిలో జ్వరం, కడుపునొప్పి, వాంతులు, జాండిస్ వంటి లక్షణాలు కనిపించాయి.

ఇప్పటివరకు సుమారు 1,500 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. 800 మందికి పైగా ఔట్‌పేషెంట్ చికిత్స పొందుతున్నారు. రక్తపరీక్షల్లో కొన్ని హెపటైటిస్ కేసులు పాజిటివ్‌గా తేలినప్పటికీ, విస్తృత స్థాయిలో వ్యాప్తి జరగలేదని అధికారులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ వంటి ఇతర వ్యాధుల పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

నీటి నాణ్యతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 107 ఇళ్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో 23 నమూనాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. కొన్ని నిల్వ ట్యాంకుల్లో కొలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. క్లోరిన్ సరైన మోతాదులో ఉపయోగించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు.

గ్రామ ప్రజలు పైపులైన్ నీరు, భూగర్భ నిల్వ ట్యాంకులు, ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచకపోవడం, సరైన శుద్ధి చర్యలు లేకపోవడం వల్ల నీటిమూలంగా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు దాదాపు 15 వేల హాలోజన్ మాత్రలను పంపిణీ చేశారు. సహాయ కేంద్రం కోసం హెల్ప్‌లైన్ నంబర్ కూడా ప్రారంభించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు మెడికల్ క్యాంపులు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

Read More
Next Story