LIVE IRAN WAR Destruction
x
టెహ్రాన్ లో బాంబు పేలుళ్ల దృశ్యం

ఇరాన్ అంతమే అమెరికా పంతమన్న ట్రంప్

యుద్ధం 7 వ రోజుకు చేరుకుంది. మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే 2400 మంది చనిపోయినట్టు అనధికార వర్గాల అంచనా


ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇవాళ్టికి 7వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో పశ్చిమ ఆసియా రణరంగంగా మారింది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1230 అని అధికార వర్గాలు చెబుతుంటే 2400 దాటిందని అనధికార వర్గాలు చెబుతున్నాయి.ఈ యుద్ధంలో ఇరాన్ కోలుకోలేని దెబ్బతిన్నదని, పతనం ఖాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాయుసేన పూర్తిగా ఖతం: ట్రంప్
అమెరికా దాడుల ధాటికి ఇరాన్ సైనిక శక్తి చిన్నాభిన్నమైందని ట్రంప్ పేర్కొన్నారు. "అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్ ధ్వంసమవుతోంది. ఆ దేశానికి ఇప్పుడు వైమానిక దళం (Air Force) లేదు, గగనతల రక్షణ వ్యవస్థ (Air Defence) లేదు. వారి వాయుసేన కథ ముగిసింది" అని ఆయన క్లెయిమ్ చేశారు.

గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్‌ను దెబ్బతీస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వేలాది మందిని చంపేస్తాం: ఇరాన్ హెచ్చరిక
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా గనుక భూతల దాడులకు (Ground Invasion) దిగితే వేలాది మంది అమెరికన్ సైనికులను చంపి, బందీలుగా పట్టుకుంటామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ హెచ్చరించారు. అమెరికా అధికారులను ప్రపంచం ముందు దోషులుగా నిలబెడతామని ఆయన పేర్కొన్నారు.
పెరుగుతున్న మరణాల సంఖ్య
గత శనివారం యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు (మార్చి 6, ఉదయం 8 గంటల వరకు) అందిన సమాచారం ప్రకారం..
ఇరాన్‌లో అధికారికంగా 1,230 మంది మరణించినట్లు సమాచారం ఉండగా, అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2,400 దాటి ఉండవచ్చు.
టెహ్రాన్ సమీపంలోని పరంద్ పట్టణంలో రెండు పాఠశాలలపై క్షిపణి దాడులు జరిగాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఇరాన్ తన దాడులను యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలకు విస్తరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై గురువారం రాత్రి డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు జరిగాయి.
కుర్దులను వాడుకోవద్దు: ఇరాక్ హెచ్చరిక
మరోవైపు, ఇరాన్‌పై యుద్ధంలో కుర్దిష్ దళాలను అమెరికా తన పావులుగా వాడుకుంటోందన్న వార్తలపై ఇరాక్ ప్రథమ మహిళ షానాజ్ ఇబ్రహీం అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మేము అద్దెకు దొరికే తుపాకీలం కాదు" అని ఆమె స్పష్టం చేస్తూ, కుర్దులను ఈ యుద్ధానికి దూరంగా ఉంచాలని కోరారు.
యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Live Updates

  • 6 March 2026 8:27 AM IST

    భారత్ కు అమెరికా మినహాయింపు..

    ఇరాన్-అమెరికా యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు అమెరికా కొన్ని కీలకమైన మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా ఇంధన భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకుంది:

    చాబహార్ ఓడరేవును వాడుకోండి..

    ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్‌కు అమెరికా 6 నెలల పాటు ఆంక్షల నుండి మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 26, 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం కొనసాగించడానికి ఈ ఓడరేవు భారత్‌కు ఎంతో కీలకం.


    పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి భారతీయ కంపెనీలకు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉంచేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.

    భారత్ వైఖరి:ఎలా ఉందంటే..

    అమెరికా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ, భారత్ ఈ యుద్ధంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇటు అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో సంబంధాలను కాపాడుకుంటూనే, అటు ఇరాన్ వంటి వ్యూహాత్మక భాగస్వామితో సంబంధాలు దెబ్బతినకుండా "చర్చల ద్వారా శాంతి"ని కోరుతోంది.

Read More
Next Story