
ఉపరాష్ట్రపతి ఎన్నికల.. తొలి ఓటు మోదీదే..
ఎన్నికకు దూరం పాటిస్తున్న బీఆర్ఎస్, బీజేడీ.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈరోజే (మంగళవారం) ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో అభ్యర్థులు సీపీ రాధాకృష్ణన్(ఎన్డీఏ), జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి(ఇండియా) మధ్య హోరాహోరీ పోటీ జరనుంది. ఇందులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉన్నా పోటీ మాత్రం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ఇరు వైపుల బలమైన అభ్యర్థులు ఉన్నారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ ఉండదు. దాంతో ఎంపీలు తమ పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా కూడా ఓటు వేయొచ్చు. అప్పుడు కూడా పార్టీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే సోమవారం ఎన్డీఏ, ఇండి కూటమి రెండూ కూడా తమ సంఖ్య బలం ప్రదర్శించడం కోసం పార్లమెంటులో వేరువేరు సమావేశాలు నిర్వహించాయి. ఇందులో భాగంగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఎవరికి ఓటు వేయాలి అన్న అంశంపై కూడా తమ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని నరేంద్ర మోదీ వేశారు. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నిక సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో నిర్వహించబడుతుంది. బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో పోలింగ్లో మొత్తం 770 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో గెలవడానికి రాధాకృష్ణన్కు 386 ఓట్లు అవసరం. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేస్తే 391 ఓట్లు అవసరం. పాలక సంకీర్ణంలోని 425 మంది ఎంపీల ఓట్లు రాధాకృష్ణన్కు ఇప్పటికే లభిస్తాయని హామీ ఇవ్వబడింది మరియు వైఎస్ఆర్సిపి ఆయనకు మద్దతు ఇవ్వడంతో ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
Live Updates
- 9 Sept 2025 1:43 PM IST
ఓటేసిన దేవేగౌడ
మాజీ ప్రధాని, జేడీ(ఎస్) రాజ్యసభ ఎంపీ హెచ్డీ దేవే గౌడ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు వేశారు.
- 9 Sept 2025 1:42 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఓట్లను వేశారు. అనంతరం పార్లమెంట్ హౌస్ నుంచి వారు వెళ్లిపోయారు.
- 9 Sept 2025 12:41 PM IST
సీపీ రాధాకృష్ణన్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు
ఉపరాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. ఇందులో తమ రాష్ట్రానికి చెందిన, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ స్వగ్రామం ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా బాణాసంచా కాలుస్తూ ప్రత్యేక ఫుడ్స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి పండుగ తరాహాలో జరుపుకుంటున్నారు.
- 9 Sept 2025 12:38 PM IST
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు హౌస్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన ఓటును వేశారు.
- 9 Sept 2025 12:35 PM IST
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు వేశారు.
- 9 Sept 2025 10:51 AM IST
సుదర్శన్ రెడ్డికి మా పూర్తి మద్దతు: తేజస్వి యాదవ్
ఉపరాష్ట్రపతి ఎన్నికపై, RJD నాయకుడు తేజస్వి యాదవ్ స్పందించారు. "...మా పూర్తి మద్దతు బి. సుదర్శన్ రెడ్డి (INDIA కూటమి అభ్యర్థి మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)కి" అని తెలిపారు.