తిరుపతి సమీపంలోని పుత్తూరు అటవీ ప్రాంతమైన సదాశివకోన చరిత్ర, ఆధ్యాత్మికత, సహజ సౌందర్యం ఒకేచోట కలగలసిన సంగమం. అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ, ప్రకృతిని దగ్గరగా అనుభవించే వ్యక్తిగా ఈ ప్రాంతం నాకు కేవలం ఒక విహార స్థలం కాదు, ఇది ఎన్నో శతాబ్దాల మౌన చరిత్రను మోసుకెళ్తున్న జీవిత గ్రంథం. శైవ భక్తులకు పవిత్రక్షేత్రంగా మాత్రమే కాదు, పురావస్తు శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్ర పరిశోధకులు, శిల్పకళా నిపుణులు, భాషా పరిశోధకులకు కూడా సదాశివకోన ఒక అమూల్య ఖజానా.
అడవుల ఒడిలో అజరామర కావాల్సిన శిలాశాసనాలు నశించిపోతున్నాయి. సదాశివకోన అరణ్యంలో దాగి ఉన్న రాతిశిలలపై చెక్కబడిన పురాతన శాసనాలు, శిల్పాలు, దేవతా రూపాలు కాలప్రవాహం, వాతావరణ ప్రభావం, మానవ నిర్లక్ష్యం కారణంగా క్రమంగా అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పులకు మాసిపోతున్నాయి.
కొన్ని శాసనాల్లో అక్షరాలు ఇప్పటికే చదవలేని స్థితికి చేరాయి. మరికొన్ని శిల్పాలు విరిగి నేలమట్టమవుతున్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే — ఇప్పటివరకు ఈ విలువైన శిలాశాసనాలకు సరైన ప్రభుత్వ లేదా శాస్త్రీయ పరిరక్షణ లేదు.
ప్రపంచం చరిత్రను కాపాడుకుంటుంటే… మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? మన దేశంలోని ఒక రాష్ట్ర రాజధాని చరిత్రతో పోలిస్తే చాలా తక్కువ చరిత్ర గల దేశాలు కూడా తమ పురావస్తు వారసత్వాన్ని డిజిటల్ స్కానింగ్, ఆన్లైన్ ఆర్కైవ్లు, పర్యాటక ప్రచారం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నాయి. కానీ మన దగ్గర మాత్రం —ముఖం చాటేస్తున్న రాతల చరిత్రను చూస్తూ మౌనం పాటించడమే మిగిలింది. “సదాశివకోన – జలపాతాల ఒడిలో కనుమరుగవుతున్న శిలాశాసనం” అమ్మవారి ఆలయానికి ఎడమ వైపున ఉన్న జలపాతం, దాని ఒడ్డున భారీ రాతిబండపై చెక్కబడిన పురాతన శిలాశాసనం ప్రత్యేక ఆకర్షణ. పరిశోధకుల అంచనాల ప్రకారం ఇది సుమారు 1300 సంవత్సరాల నాటిదై ఉండే అవకాశం ఉంది.
ఈ శాసనం ద్వారా ప్రాంతీయ రాజవంశాల పరిపాలన విధానాలు శైవ దేవాలయాల నిర్వహణ భూదానాలు, పంట ఆదాయ వ్యవస్థ దక్షిణ భారత భాషల పరిణామం వంటి కీలక సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
కానీ ప్రస్తుతం వేడి, వర్షం, గాలి, ఆల్గే ప్రభావం వల్ల రాతి ఉపరితలం పొరలుగా ఊడిపోతోంది. సందర్శకుల అవగాహనలేమి వల్ల కొన్ని భాగాలు ఇప్పటికే నశించాయి. మిగిలిన భాగాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి. అత్యవసరంగా చేపట్టాల్సిన పరిరక్షణ చర్యలు ప్రభుత్వం, పురావస్తు శాఖ, పరిశోధనా సంస్థలు తక్షణమే ముందుకు రావాలి:
1. శిలాశాసనాల హై-రెసల్యూషన్ డిజిటల్ స్కానింగ్
2. శాస్త్రీయ రసాయన పరిరక్షణ (Chemical Preservation)
3. ప్రదేశంలో సమాచార బోర్డుల ఏర్పాటు
4. సదాశివకోనను “రక్షిత పురావస్తు స్థలం”గా గుర్తింపు.
ఇవి చేయకపోతే, అనేక శతాబ్దాల సాంస్కృతిక చరిత్ర శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. చారిత్రక ప్రాముఖ్యత – ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలి. సదాశివకోన, శ్రీకాళహస్తి, నగరి, నందలూరు, పుత్తూరు ప్రాంతాలు 7వ–10వ శతాబ్దాలలో పల్లవ–చోళ–పాండ్య శైవ సంస్కృతి ప్రాభవ కేంద్రాలుగా నిలిచాయి. అమ్మవారికోన జలపాతం పక్కన ఉన్న నటరాజ రూపంతో కూడిన వట్టెలుత్తు శిలాశాసనం, ఈ ప్రాంతం ఒకప్పుడు తపస్సు, యాగాలు, విద్య, వైద్యం, సంస్కృతికి కేంద్రంగా ఉండేదని స్పష్టం చేస్తోంది.
ముగింపు.
ఈ రాతిశాసనం కేవలం ఒక రాతిబండ కాదు — ఇది మన ప్రాచీన చరిత్రను నిలబెట్టిన జీవంత డాక్యుమెంట్. దీన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. పురావస్తు శాఖ విధి. స్థానిక పౌరుల ధర్మం.
ఈరోజు మనం దీన్ని రక్షించకపోతే, రేపటి తరాలు మన చరిత్రలోని ఒక విలువైన అధ్యాయాన్ని ఎప్పటికీ చదవలేని స్థితికి చేరిపోతాయి.