సిన్మా వైభోగం
x

సిన్మా వైభోగం

మస్తు మంది ఉన్నారు.కిటికీలో నుంచి ఒకాయన టికెట్లు ఇస్తున్నాడు. టికెట్లు తీసుకొని ఒకరి మీద ఒకరు పడి గేటు దగ్గరికి ఉరుకుతున్నారు.



-జూకంటి జగన్నాథం


నేను అన్నం తిని సందులో మూతిని మట్టతో తుడుచుకుంటూ బయటకు వచ్చి గద్దె మీద కూర్చున్నాను.

మా ఊరికి అప్పటికి కరెంట్ రాలేదు. వీధి దీపాల కందిల్ తలుపు తీసి నాలుగు బజార్ల కాడ నిలబడ్డ ఒంటి స్తంభానికి నిచ్చెన వేసుకొని గ్రామపంచాయతీ జవాన్ దీపాలు ముట్టిచ్చి గ్లాస్ తలుపు ఎప్పటి లెక్క గాలి తగలకుండా పెడుతున్నాడు. చుట్టూ కొంచెం చిత్రంగా మసక గా వెలుగునీడలు గమ్మత్తుగా పడుతున్నాయి.

అప్పుడే అయ్యారోళ్ల వెంకట నరసయ్య మామ తిని వచ్చి కూర్చొని, "అన్నం తిన్నావురా అల్లుడా మీ అయ్యలు ఇంట్లో ఏం చేస్తున్నర్రౌ "అని పలకరించాడు.. నేను తిన్న మామా ఇంకా వాళ్ళు తింటున్నారు సమాధానం చెప్పాను.

ఇంతలోనే బలిజోల్ల నాగయ్య,మామ అసులోళ్ళ రాజయ్య మరియు ఇంట్లో నుంచి వెంకట నరసయ్య తమ్ముడు రంగయ్య మామ మొత్తం నలుగురు గద్దె మీద పక్కపక్కన కూర్చున్నారు. తిన్నావురా అంటే తిన్నావురా ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.
మెల్లగా ఒక్కొక్కరు బట్ట బనీను లోపలి జేబులో నుంచి ఎరుకల రాజయ్య బీడీల కట్టని తీసి రెండు చేతుల మధ్య పెట్టి అటూ ఇటు తిప్పారు . ఒక్కొక్కరు ఒక బీడీ నోట్లో పెట్టుకున్నారు. వెంకట నరసయ్య మామ ఒక జిట్ట పులి బొమ్మ ఉన్న అగ్గి పెట్టెలోంచి ఒక పుల్లను తీసి గీయగానే బగ్గుమని మంట అంటుకుంది . ఒక పుల్లతో బీడీని ముట్టిచ్చి ఒకరిది ఒకరు నలుగురు బీడీలను వెలిగించుకున్నారు.

వెంకట నరసయ్య మామ బీడీ గట్టిగా పీల్చుకొని ముక్కుల నుంచి పొగ వదులుతున్నాడు.మిగతా ముగ్గురు కూడా పొగ ఊదుకుంటూ హాయిగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. ఇంతలో అవుసులోళ్ళ రాజయ్య ఓ నాగయ్య మొన్న సిరిసిల్లలో సినిమా నారాయణ కలిసి ఇయ్యాల రెండో ఆటకు రమ్మనే చెప్పాడు కదా డు పోదామా అని మిగతా వాళ్లకు వినవచ్చేటట్టు అడిగిండు . "జెర ఆగరాదు రాఎక్కడి వారు అక్కడ పండుకోనీయ్". రంగయ్య అన్నాడు.

ఇంతలో మా నడిపి చిన్న బాపు వచ్చి నా పక్కన కూర్చున్నాడు.

"తిన్నావా శ్రీశైలం బావా" అయ్యరోళ్ల రంగయ్య అడిగిండు. "ఆ మా ఇంట్లోనే తిన్న" కొంచెం వ్యంగ్యంగా జవాబు చెప్పిండు. మేము ఏమైనా మంది ఇండ్లల్ల తిని వచ్చినమా ఎవరింట్లో వాళ్ళమే తిని వచ్చినం" అంతే సూటిగా సమాధానం చెప్పిండు. బావ, బామ్మర్దుల
పరాశికం మాటలు గట్లనే మాట్లాడుకుంటారు.

కొంచెం సమయం అయినంక వెంకటనరసయ్య "శ్రీశైలం బావ రెండో సినిమా కు పోతున్నాం వస్తావా" అడిగిండు.

మా చిన్నబాబు "నేను మొన్ననే మొదటి ఆటకు పోయి సినిమా చూసి వచ్చిన రానోయ్"అన్నాడు.

ఊరు కన్ను మలిగినట్టయింది. ఒక్కొక్కరు లేసి ఊరబండ దిక్కునడిచారు. "కాలువకు పోతరా ఏందిరో" మా చిన్నబాబు అడిగిండు. వాళ్లు మారు మాట్లాడకుండా. " ఆ ఆ" అనుకుంటూ పోయారు.

బండ మీద పండుకున్న కుక్కలు ఒక్కసారి గయ్యి మని లేచి మీది మీదికి వస్తున్నాయి. భుజం మీద వేసుకున్న దువ్వాలతో '"చూ చూ కటే కటే "అని దూరంగా వెళ్లగొడుతున్నారు . కుక్కల గుంపు పోగానే , ఇద్దరు ఇద్దరు చొప్పున విడిపోయి రెండు పశువుల దొడ్ల పనగడి తీసి లోపలికి పోయారు. లోపల పశువులు గడ్డిమేస్తున్న చప్పుడు "సర్ సర్" అని వినపిస్తుంది. అరేయ్ మచ్చల ఎద్దు కొమ్ములతో కుమ్ముతదిరో పదిలంగా పక్కనుంచి నుంచి రా రా"రంగయ్య వెనుక వస్తున్న రాజయ్యకు జాగ్రత్త చెప్పాడు.

గడ్డివాముల దగ్గరకు పోయి గడ్డి గుంజు వేస్తున్నారు. నీ అవ్వ గడ్డివాము గట్టిగా మెలిగినర్ అనుకుంటూ గట్టిగా రెండు చేతులా గుంజితే పిడికెడు గడ్డి చేతులకు వస్తుంది. అట్లా గుంజుకుంటా రెండు కుప్పలు వేశారు. 'అరే తువ్వాల తోటి గడ్డిమోపు కట్టుకోరా రాజయ్య" రంగయ్య చెప్పి తన భుజం మీది తువ్వాలతో మరో మోపు కట్టుకున్నాడు.

వీళ్ళ లెక్కనే వెంకట్ నరసయ్య , నాగయ్య వాళ్ళు కూడా గడ్డిమోపు మనిషికి ఒకటి పట్టుకొని, ఎప్పటి లెక్క రెండు దొడ్ల పన్గడ్లను దగ్గరికి పెట్టారు.

అటు ఇటూ చూసి ఎవరు లేరని నిర్ణయానికి వచ్చి, ఎవరి గడ్డిమోపును వారు నెత్తిమీద ఎత్తుకున్నారు . రాజయ్య "ఓ నాగన్నా ఎటు నుంచి సిరిసిల్లకు పోదామే .ముందట తొవ్వ తీయవే" అడిగాడు. ముందట నాగయ్య నడుస్తుంటే వెనుక ఒక్కొక్కరు పొలాల ఒడ్డుల మీది నుంచి పెద్ద చిలుం బాయి దగ్గరికి మెల్ల మెల్లగా పాతులాడుకుంటూ చేరారు

దూరం నుంచి సిరిసిల్ల కరెంటు వెలుగులు కనబడుతున్నాయి. ఇగ నడువుండ్రి అంటూ ఒకరి వెనుక ఒకరు వరుసగా నడుచుకుంటూ పోతున్నారు. పొలం మధ్యలో నుంచి సర్రున మోత పెడుతూ వీళ్ళ ముందటి నుంచి అవతలి పొలంలోకి ఏదో వెళ్ళింది. ముందే పిరికి పిత్తులోడు అవుసుల రాజయ్య" అయ్యా నీ బాంచన్" అంటూ గజ్జన వణికిపోయాడు. రాజయ్య భయానికి అందరూ నవ్వుకున్నారు. "రాజయ్య మెల్లగా రా నీరు కట్టె పాములుంటయ్ వాటి మీద అడుగు వేసేవు?" అని రంగయ్యకు జాగ్రత్తలు చెప్పారు.

అట్లా నడుచుకుంటూ మానేరు వాగు లోకి అడుగుపెట్టారు. " ఎటు పోదాం ఎట్లా పోదాం" నాగయ్యను రంగయ్య అడిగాడు.
ఇంకా ఎట్లా పోతం. మనం ఇంతకు ముందు పోయినట్టే మండేపెల్లి పిల్ల బాట చింతల కాడికి పోదాం . వాగు ఇసుకలో సిరిసిల్ల వైపు కనబడీ కనబడుతున్న చింతల వద్దకు అడ్డం గా నడిచారు.

"అవునే సినిమా కాడికి ఇట్లనే పోతే ఏమైతది?" రాజయ్య అన్నాడు.

"అరేయ్ రాజయ్యా నీకు తెలుస్తదా తెలియదను అనుకోవాలెనా? ఈ గడ్డిమోపులు ఎత్తుకొని సినిమా కాడికి పోతే ఎవరైనా నవ్వుతారు. వాళ్ళ ఇంటిదగ్గర బర్రెను కట్టేసిన పాకలో వేసి రావాలి" వెంకట నరసయ్య కోపంగా చెప్పాడు.

" అవ్! గని రాజయ్య పొద్దంతా ఏం చేసినావ్ రా ఇంటికాడ" అడిగింది నాగయ్య

"గదే వెండి పట్టా గొలుసుల జాలర్లు చేసిన" ప్రశ్నకు జవాబు చెప్పి, మరి నువ్వేం చేసినవ్ అని అడిగాడు .

"గదే కూరగాయల తోటలో పెరిగిన పాలకూరను కోసి ఈత నారతో కట్టలు గట్టి కరెంటు బాయి కాడ కడిగి ఇంటికాడ పెట్టిన" నాగయ్య బదులు చెప్పాడు.

"నేను పొద్దుగాల పెద్ద బండి కట్టుకొని, అందులో పది ఇస్తారు కట్టలు వేసుకొని మా నరసవ్వని తీసుకొని సిరిసిల్ల మార్కెట్లో అమ్ముకొని, గుజ్జ రాజయ్య దుకాన్ల రంగు నూలు బండిలో వేసుకొని బొందల రాజేశం ఇంట్లో వేసి కిరాయ తీసుకుని వచ్చిన్రా" వెంకట నరసయ్య చెప్పాడు.

ఇగ రంగయ్య ఒకటి అనడు రెండు అనడు మౌనంగా నడుస్తున్నాడు. రంగయ్య వంతు కూడా రాజయ్యే " మన రంగయ్య కు రోజూ ఏమి పని లేదు. పొద్దుగాల లేవాలి .చెరువులోకి పోయి తెల్లగా ధోతి, అంగీని సన్ లైట్ బట్టల సబ్బుతో తెల్లగా ఉతుక్కోవాలి. అక్కడే ఉన్న సాకలోల్ల గోళంలో టినోపాల్ వేసి బట్టలను స్నానం చేసి దండెము మీద బుగ్గోలె ఎండిన తర్వాత మడత పెట్టుకుని ఇంటికి రావాలి. బువ్వ బలువు కంకెడంత తిని, పరాకత్ గా కాలు చాపి పగటీలి నిద్ర తీయాలి. లేచి సాయంత్రం ఇంటి ముందున్న గద్దెల మీద కూర్చోవాలి .నువ్వు ప్రతి రోజూ చేసే పని ఇదే కదా రంగయ్యా! ఆయన దినచర్యఅంతా చెప్పాడు.

"అరేయ్ రాజయ్య నీకేం పని లేదు రా" కోపంగా రంగయ్య తిట్టినంత పని చేశాడు.

"ముచ్చట్లు చాలు రెండో సినిమాకి పొద్దు పోతది. జెర తొందరగా నడువుండ్రి " వెంకట నరసయ్య మందలించాడు.

మౌనంగా చింత చెట్ల వైపు వేగంగా నడుస్తున్నారు. లైట్ల వెలుగులు మరింత ఎక్కువై వాగు స్పష్టంగా కనపడుతుంది.

రెండు నిమిషాలలోనే వాగు దార దాటి చింతల ఒడ్డు ఎక్కారు. నెహ్రునగర్ లో నారాయణ ఇంటి దిక్కు నడుస్తున్నారు.

నారాయణ ఇంటి కాడికి చేరి బర్రె పాకలో గడ్డిమోపులు వేసిండ్రు. ఎవరి తువ్వాలను వారు జాడిచ్చి దులిపి భుజాల మీద వేసుకున్నారు. వీళ్ళ అలికిడికి లోపల నుంచి "నారాయణ భార్య ఎవరూ" అంది. "మేమే అక్కా తంగళ్ళపల్లి నుంచి నాలుగు గడ్డిమోపులు తెచ్చి వేసినమ్. నారాయణకి చెప్పు" నాగయ్య చెప్పాడు. ఆమె లోపలి నుంచే " సరే సరే" అంది.

"అవ్ నాగయ్య వరస మంచిగానే కలిపినవ్ ఎక్కడి నుంచి ఎట్ల అక్క అయితది' రాజయ్య ఆచూకీ తీసిండు.

"ఓరి వారీ అక్క ఎవరో నీకు తెలవదా మా వాడకట్టు పడిగెల రాజయ్య చెల్లెనేరా" చెప్పాడు "అట్లనా నాకు ఎరుకలేదు" రాజయ్య నోరు వెల్లబెట్టాడు .

అక్కడి నుంచి గాజులోల్ల సంది తొవ్వల నుంచి సుభాష్ విగ్రహం కాడికి చేరి నడుస్తున్నారు. ఎదురుగా సైకిళ్ల మీద గుంపులు గుంపులుగా మంది వస్తున్నారు. వాళ్లను ఆపి నాగయ్య మొదటి ఆట సినిమా అయిపోయిందా అడిగిండు. " అయిపోయింది అయిపోయిందంటూ" నడుచుకుంటూ పోతున్నారు.

సినిమా టాకీస్ తూర్పు వైపు ఉన్న పెద్ద గేటు తెరిచచివుంది. అందులోంచి నారాయణ ఉన్న వైపు నడిచారు. ఇంకా టికెట్లు మొదలు కాలేదు . మమ్మల్ని దూరం నుంచే చూసి నారాయణ వాళ్ల దగ్గరికి వచ్చాడు. ఒకరికి ఒకరు కుడిచే చేయి ఎత్తి నమస్తే అంటే నమస్తే అనుకున్నారు. వచ్చినారా ఎన్ని గడ్డి మోపులు ఇంటికాడ వేసిండ్రు" అడిగాడు. "నాలుగు వేసి అక్కకు కూడా చెప్పినమ్" నాగయ్య చెప్పాడు.

లోపల పక్కకు ఉన్న చాయ్ హోటళ్లకు మమ్ముల్ని తీసుకుపోయి వీళ్లకు నాలుగు చాయ్ లు ఇవ్వమని గల్లా మీద కూర్చున్న ఆయనకు చెప్పి, పావులా మా చేతిలో పెట్టి "నేను పిలిచినప్పుడు రాండ్రి అప్పటిదాకా ఈ బెంచీల మీద కూర్చోండ్రి". బెల్లు మోగేసరికి గేటు దగ్గరికి బిర బిరా నారాయణ పోయాడు.

మస్తు మంది ఉన్నారు.కిటికీలో నుంచి ఒకాయన టికెట్లు ఇస్తున్నాడు. టికెట్లు తీసుకొని ఒకరి మీద ఒకరు పడి గేటు దగ్గరికి ఉరుకుతున్నారు.

సినిమా మొదటి రీలు అయిపోయి, రెండో రీలు పడ్డది. ఛాయ్ లు తాగి, మనిషికి రెండు బీడీలు దాకా తాగినం. ఇగ పిలవడు అగ పిలవడం ఎదిరి చూసి విసుగు వచ్చింది. ఇంతలోనే ఇంటర్వెల్ బెల్లు మోగింది. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

మేము చూసిచూసి నారాయణ దగ్గరికి మతులబు తెలుసుకొని రమ్మని నాగన్నను తోలారు . నారాయణ కొంచెం దూరం నిలబడుండ్రి, నేను సైగ చేసినప్పుడు రాండ్రి లోపలికి తోలుతా అని చెప్పాడు.

మల్లా లాంగ్ బెల్ మోగింది. మంది గుంపులు గుంపులుగా లోపలికి పోతున్నారు. నారాయణ ఒక్కొక్కరి నుంచి పాసు తీసుకుంటూ హాల్ లోకి తోలుతున్నాడు. అంతలోనే మా దిక్కు చెయ్యితో రమ్మని సైగ చేశాడు. మేము దగ్గరికి పోయాము. నారాయణ పోయే మందిలనే మమ్మల్ని కలిపి లోపలికి తోలిండు.

సతీ సావిత్రి సినిమా విరామం తర్వాత మొదలైంది. భర్త ప్రాణాన్ని తీసుకుపోతున్న యమధర్మరాజుకు సావిత్రి అడ్డం తిరిగింది. పద్యాలలోనే నా భర్తకు ప్రాణ భిక్ష పెట్టమని అడుగుతుంది . ఆయన ససేమురా కూడదన్నాడు. సావిత్రి వేడుకుంటుంది. మనసు కరిగి నీ భర్త ప్రాణం ఇస్తినిపో యమధర్మరాజు చెయ్యికి చుట్టుకున్న యమపాశం విసిరి అన్నాడు. సతీ సావిత్రి భర్త తిరిగి నిద్రలో నుంచి లేచినట్టు లేచాడు. ఇంతలో లైట్లు వెలిగినై. శుభం పడింది. లేచి అందరూ సావిత్రి పడ్డ కష్టాలు పతివ్రత తనం గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ బయటకు నడుస్తున్నారు.

మేము అందరికన్నా ముందుబయటకు వచ్చి నారాయణ దిక్కు చూసినాము. ఆయనకు అర్థం అయినట్టు తల ఊపి "మొదటి సగం సినిమాకు రేపు ఫస్ట్ షోకు అందరూ రాండ్రి. రేపు గడ్డి ఏమీ వద్దు తోలిస్తా" అని మా అనుమానం తీర్చాడు.

మేము రోడ్డు మీదికి వచ్చి మనిషికి ఒక బిడి ముట్టించాము. పొగ ఊదుతూ ఇంటి బాట పట్టినాము. అవుసుల రాజయ్య కొంచె కొంటె మాటలోడు " నీయవ్వ ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు తీసుకున్నట్టు మన పని అయింది"అన్నాడు

అందరూ పైకే గట్టిగా నవ్వుకున్నారు.



Read More
Next Story