పాలు, పెరుగు అమ్మడం తెలియని ఊరు.. అంతా ఫ్రీనే..
x

పాలు, పెరుగు అమ్మడం తెలియని ఊరు.. అంతా ఫ్రీనే..

ఆ నిర్ణయం వెనుక కథ ఏంటీ?


‘ ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాట నిలుపుకొనే వారు మన చుట్టూ ఉన్నారంటే,

నమ్మశక్యంగా ఉండదు కానీ, అలాంటి నిజాయితీపరులున్న ఒక గ్రామం కథ ఇది. కరువు కష్టాలు ఎదురైనా కట్టుబాటు తప్పని ప్రజల నిజాయితీని మీరు చూసి తీరాలి. ’ అన్నాడు మిత్రుడు కృష్ణ మోహన్‌. ఆయన కర్నూల్‌ జిల్లా , గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపిఓగా పనిచేస్తున్నారు. గోనెగండ్ల మండలంలో కొన్ని గ్రామాల్లో కరువును ఎదుర్కొంటూ సాగు చేస్తున్న కొందరు రైతులను పరిచయం చేశారు. తరువాత మధ్యాహ్నం కర్నూల్‌ వైపు వస్తూ ఒక చోట ఆగి టీ తాగుతున్నపుడు ఈ మాట అన్నాడు.

ఆయన చెప్పిన గ్రామానికి బయలు దేరాం.

ప్రశాంతమైన పచ్చని పొలాలు మధ్య మలుపుల దారిలో ప్రయాణించి అక్కడికి చేరుకున్నాం. అక్కడి జీవనం రిచ్‌గా ఏమీ లేదు కానీ పాత పద్దుతుల్లో కట్టుకున్న ఇండ్లు, బయట అరుగుల మీద కూర్చొని కూల్‌గా మాట్లాడకుంటున్న మనుషులు కనిపించారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, గంజహళ్లి. ఇక్కడ దాదాపు అందరూ మధ్యతరగతి వారే, ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత పొలం, లేదా పాడి పశువులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న గ్రామం ఇది.

గ్రామంలో ఒక ఇంటి ముందు పాలు పోస్తుంటే కొందరు తీసుకెళ్తున్నారు. లీటర్‌ ఎంత అని మేం అడిగితే? ‘ ఇక్కడ పాలు అమ్మరు. ఉచితంగానే ఇస్తారు.’ అన్నారు.

‘‘ మా పూర్వీకులకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి, ఈ ఊర్లో పాలు,పెరుగు అమ్మం. ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తాం తప్ప విక్రయించం.’’ అన్నారు, ఇంటి ముందు మంచం మీద కూర్చున్న అవ్వలు రామంజనమ్మ, అంజనమ్మ.

రామంజనమ్మ, అంజనమ్మ.

తరాలుగా తప్పని మాట

‘‘ పాలు విక్రయించ వద్దని పూర్వీకుల చెప్పిన మాటను ఇక్కడ తరతరాలుగా పాటిస్తున్నారు. 843 ఇళ్లు, 4వేల మంది జనం నివశించే మా గ్రామంలో ఏ ఒక్కరిలోనూ భేషజాలుండవు, భిన్న వర్గాల వారు కలిసికట్టుగా ఉంటారు. వ్యవసాయమే ప్రధానాధారమైన ఇక్కడ పాడికి కొదవలేదు. అయితే ఏ ఒక్కరూ పాలను అమ్మరు. గ్రామంలో ఎవరైనా చిన్నారుల కోసం, వివాహాలు, పండగల సమయంలో అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు.’’ అంటారు గ్రామ మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు.

గ్రామ మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు.

ఈయన ప్రతీ రోజు ప్రభుత్వ బడి పిల్లలను చేరదీసి ఉచితంగా ట్యూషన్‌ చెబుతారు.

ఏనాడో పెద్దల మాటకు కట్టుబడి గంజహళ్లి. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం, కొద్ది రోజుల తరువాత ఎంతో కష్టంగా మారింది. వరస కరవులు... సాగుబడి లేని ప్రతికూల పరిస్థితులున్న ఆ ప్రాంతంలో చుట్టు పక్క గ్రామాల్లో రైతులు పాడినే ప్రధాన జీవనాధారంగా మార్చుకున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ గంజహళ్లి గ్రామస్తులు మాత్రం వెనుకడుగు వేయకుండా, పూర్వీకుల మాట మరవకుండా జీవనం కొనసాగిస్తున్నారు.

మాట వెనుక అసలు కథ...

‘ కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన చరిత్ర ఇది. గంజహళ్లిలో మహాత్మ బడే సాహెబ్‌ అనే ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. ఓ రోజు తన కుమారుడితో పాలు తీసుకురావాలని చెప్పారు. గ్రామంలోకి వెళ్లి ఉట్టి చేతులతో వెనక్కి వచ్చిన ఆ కుమారుడు పశువులు వ్యాధులకు గురై మరణించాయి, కరవుతో రైతులు పోషించలేక అమ్ముకున్నారని, ఎక్కడా పాలు దొరకలేదని తిరిగి వస్తారు. అపుడు బడేసాహెబ్‌ అదే గ్రామంలో ఉంటున్న ఒక రైతు పేరు చెప్పి అతనింటిలో పాడిపశువు ఉంది. పాలు అడిగి తీసుకు రండి అని అంటాడు. కుమారుడు అక్కడికి వెళ్లేసరికి అదీ ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న గోవు నుంచే పాలు పితికి తీసుకెళ్తారు. అప్పడే బడేసాహెబ్‌ స్వామి గ్రామంలో గోవధ వద్దని, పాలు అమ్మకూడదని, ఆవుదూడలకు పాలు లేకుండా చేయరాదని ప్రజలకు చెబుతారు. ఆయన మాట మీర కుండా నాటి నుంచి నేటి వరకు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవరూ పాలు అమ్మరు, పాడి ఉన్న వారు పిల్లల కోసం ఎవరైనా అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు.’ అని, బడేసాహెబ్‌ దర్గా గౌరవ అధ్యక్షుడు సయ్యద్‌ చిన్న ముద్గోల్‌, మాతో అన్నారు. ఈయన బడే సాహెబ్‌ వంశంలో 8వ తరానికి చెందిన వాడు. ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

బడేసాహెబ్‌ దర్గా గౌరవ అధ్యక్షుడు సయ్యద్‌ చిన్న ముద్గోల

మహాత్మ బడే సాహెబ్‌ జ్నాపకార్ధం గ్రామం మధ్యలో దర్గాను నిర్మించారు. అన్ని మతాల ప్రజలు ఇక్కడ ప్రార్ధనలు జరుపుతారు.

ఇక్కడ 233 ఎకరాల్లో వేరుశెనగ,వరి, మిర్చి సుమారు 50 ఎకరాల్లో పశుగ్రాసం పండిస్తున్నట్టు పొలాల్లో కనిపించిన రైతులు చెప్పారు.

పూర్వం బడేసాహెబ్‌ తాత చెప్పారు, పెద్దలు అనుసరించారు. వారు చెప్పిన మాటను మేం పాటిస్తున్నామని పశువులను కాస్తున్న యాదవులు మాతో అన్నారు. అలా పాలు,మజ్జిగ ఇంటి అవసరాలకు వాడుకుంటారు తప్ప విక్రయించరు. వారు మాట తప్పరు.

Read More
Next Story