మహారాష్ట్రలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
x

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ నానా పటోలే

మహారాష్ట్రలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. నవంబర్ 20వ తేదీ పోలింగ్, ఓట్ల లెక్కింపు 23న ఉంటుంది.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ నానా పటోలే సకోలి నుంచి, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ కరద్‌ సౌత్‌ నుంచి, ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ బ్రహ్మపురి నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు కేటాయించారు.

మాజీ మంత్రులు నితిన్ రౌత్ నాగ్‌పూర్ నార్త్ నుంచి, బాలాసాహెబ్ థోరట్ సంగమ్‌నేర్ నుంచి, జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ ధారావి నుంచి, అమిత్ దేశ్‌ముఖ్ లాతూర్ సిటీ నుంచి, లాతూర్ రూరల్ నుంచి ధీరజ్ దేశ్‌ముఖ్‌ను హస్తం పార్టీ బరిలో దిగింది.

అలాగే మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ చండీవలీ నుంచి, అస్లాం షేక్ మలాడ్ వెస్ట్ నుంచి, రంజిత్ కాంబ్లే డియోలీ నుంచి, వికాస్ ఠాక్రే నాగ్‌పూర్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు.

ఇక జలగావ్ జిల్లాలోని రావర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీష్ చౌదరి కుమారుడు ధనంజయ్ చౌదరిని పార్టీ బరిలోకి దింపింది. మీరా భయందర్ నుంచి ముజాఫర్ హుస్సేన్ థానే బరిలో ఉన్నారు.

భోకర్‌లో కాంగ్రెస్‌కు చెందిన తృప్తి కొండేకర్ బీజేపీకి చెందిన శ్రీజయ చవాన్‌తో పోటీపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌. అశోక్ చవాన్ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల బీజేపీలో చేరారు.

అయితే చవాన్ బంధువు మీనాల్ ఖట్‌గావ్‌కర్‌ను కాంగ్రెస్ నైగావ్ నుంచి పోటీకి దించగా.. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రఫుల్ గుదాధే తలపడనున్నారు.

ఇక గోండియా నుంచి మాజీ ఎమ్మెల్యేలు గోపాల్‌దాస్‌ అగర్వాల్‌, అమరావతి నుంచి సునీల్‌ దేశ్‌ముఖ్‌కు కాంగ్రెస్‌ టిక్కెట్లు కేటాయించింది. వీరిద్దరూ గతంలో బీజేపీలో చేరి ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు.

జ్యోతి గైక్వాడ్ ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ సోదరి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆమె నాలుగు పర్యాయాలు ధారవి ఎమ్మెల్యేగా ఉన్నారు.

అమిత్, ధీరజ్ దేశ్‌ముఖ్‌ ఇద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు.

నవంబర్ 20న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) ఒక్కో కూటమి భాగస్వామి 85 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఈ జాబితా వెలువడింది.

శివసేన (యుబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. 288 సీట్లలో 270 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన సీట్లపై ఇతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

మహాయుతి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యం..

" మేము 270 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాం. సమాజ్‌వాదీ పార్టీ, PWP, CPI(M), CPI, AAPను కలుపుకోవాలనుకుంటున్నాం. వారిని కేటాయించే సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. మహాయుతి ప్రభుత్వాన్ని ఓడించడానికి MVA ఐక్యంగా పోరాడుతుంది." అని రౌత్ పేర్కొ్న్నారు.

పాలక మహాయుతి కూటమిలో ఏక్‌నాథ్ షిండే శివసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఉన్నాయి.

288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.

Read More
Next Story