
పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన టీవీకే..
తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ ఏమన్నారు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల పొత్తులపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఏఐఏడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) ఇప్పటికే భారతీయ జనతాపార్టీ (BJP) తో జతకట్టిన విషయం తెలిసిందే. టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ కూడా కాషాయం దళంతో చేతులు కలుపుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్డీఏ (National Democratic Alliance)తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
టీవీకేతో పొత్తు కోసం చర్చలు జరుగుతున్నాయా? అనే విలేఖరుల అడిగిన ప్రశ్నకు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.
"మీరు కూటమి గురించి ఆందోళన చెందుతున్నారు. కాని నేను ప్రజాసమస్యలు, ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, మహిళలకు భద్రత లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నాను" అని నాగేంద్రన్ శనివారం (మార్చి 14) చెన్నైలో విలేఖరులతో అన్నారు.
TVK జిల్లా కార్యదర్శులతో మార్చి 13న టీవీకే వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంపై కూడా నిర్మల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ బలోపేతం, తమ బలం గురించి మాత్రమే అందులో చర్చించుకున్నామని, పొత్తుల గురించి కాదని సమాధానమిచ్చారు.

