తమిళనాడు ఎన్నికలు: సత్తూరు నుంచి నైనార్ నాగేంద్రన్
x

తమిళనాడు ఎన్నికలు: సత్తూరు నుంచి నైనార్ నాగేంద్రన్

2021 ఎన్నికల్లో తిరునెల్వేలి నుంచి విజయం సాధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు.

ఇప్పటి వరకు తనకు కంచుకోటగా భావించిన తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగేంద్రన్.. ఈసారి అక్కడి నుంచి మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తిరునెల్వేలి నుంచి విజయం సాధించారు.

రాష్ట్రంలో బీజేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకునే వ్యూహంలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సత్తూరు నుంచి పోటీ చేయడం ద్వారా కొత్త ప్రాంతాల్లో పార్టీ స్థానం బలపడుతుందని భావిస్తున్నారు.

కన్యాకుమారి పర్యటన సందర్భంగా నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ..“ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో నేను సత్తూరు నుంచి పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారు,” అని అన్నారు.

ఇటీవల జరిగిన సీట్ల పంపకం ఒప్పందంలో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) బీజేపీకి 27 సీట్లు కేటాయించింది. అయితే తిరునెల్వేలి, కోయంబత్తూరు సౌత్ వంటి కీలక నియోజకవర్గాలు బీజేపీకి దక్కలేదు.


‘అధిష్టానమే నిర్ణయిస్తుంది’

ఇదే సమయంలో కోయంబత్తూరు సౌత్ నుంచి 2021లో గెలిచిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కూడా మరో నియోజకవర్గానికి మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. “ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను,” అని ఆమె అన్నారు.

ఇప్పటివరకు బీజేపీ తన అభ్యర్థుల పూర్తి జాబితాను అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి పెరుగుతోంది.

Read More
Next Story