
పశ్చిమ బెంగాల్ : ‘మమతను ఓడిస్తా’
గురువారం ప్రచారాన్ని ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్.. 25వేల మెజార్టీ వస్తుందని సువెందు అధికారి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ తరఫున ప్రతిపక్ష నేత సువెందు అధికారి గురువారం తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నేరుగా పోటీ పడుతున్నారు.
ప్రచారం షురూ..
సువెందు ఉదయం ఢిల్లీ నుంచి కోల్కతా చేరుకుని, చక్బేరియా రోడ్లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం కొనసాగిస్తానని చెప్పారు.
గెలుపుపై ధీమా..
ప్రజలు మద్దతు తనకు ఉందన్న సువెందు.. 25వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సువెందు విశ్వాసం వ్యక్తం చేశారు.
టీఎంసీపై విమర్శలు
తృణమూల్ కాంగ్రెస్పై సువెందు తీవ్ర విమర్శలు చేశారు. చిన్న వ్యాపారులు, డ్రైవర్లు, సాధారణ ప్రజలు పార్టీ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీను ఉద్దేశిస్తూ, ఆయన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఉద్రిక్త పరిస్థితులు..
ర్యాలీ సమయంలో బీజేపీ, టీఎంసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగిపోయి, రెండు వర్గాలను వేరు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు..
సువెందు భవానిపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, బీజేపీ కార్యకర్తలకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తన ప్రచారాన్ని అడ్డుకుంటే లేదా కార్యకర్తలను వేధిస్తే నిరసన చేపడతానని హెచ్చరించారు.
రెండు స్థానాల్లో పోటీ గురించి..
రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడంపై సువెందు స్పందించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ సూచనతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. నందిగ్రామ్లో భారీ మెజారిటీతో గెలుస్తానని, అలాగే భవానిపూర్లో కూడా మమతా బెనర్జీని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా భవానిపూర్లో బీజేపీ ప్రచారం ఘనంగా ప్రారంభమవడంతో ఎన్నికల పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

