బీహార్‌: ఏప్రిల్ 14న నితీష్ రాజీనామా?
x

బీహార్‌: ఏప్రిల్ 14న నితీష్ రాజీనామా?

కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు బీజేపీ కసరత్తు..


Click the Play button to hear this message in audio format

బీహార్‌లో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఏప్రిల్ 14న తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే రోజున ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో, రాష్ట్రంలో అధికార మార్పిడికి మార్గం సుగమమవుతుందని వార్తలోస్తున్నాయి.

కేబినెట్ సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్, గవర్నర్ సయ్యద్ ఆత హస్‌నైన్ (Syed Ata Hasnain)కు తన రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం.

ఎన్డీఏలో కొత్త నాయకుడి ఎంపిక..

ఈ పరిణామాల మధ్య, ఎన్డీఏలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ (Bharatiya Janata Party) ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ, కేంద్ర మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)ను బీహార్ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నికకు కేంద్ర పరిశీలకుడిగా నియమించింది.

జేడీ(యూ) నాయకుడు సంజయ్ కుమార్ ఝా (Sanjay Kumar Jha) ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్ 13 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేసులో సమ్రాట్ చౌదరి..

ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి (Samrat Choudhary)ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడిగా కనిపిస్తున్నారు. ఆయన హోం శాఖను కూడా నిర్వహిస్తున్నారు.

ఇతర అభ్యర్థులుగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai), రాష్ట్ర మంత్రులు లఖేంద్ర పాశ్వాన్, శ్రేయసి సింగ్ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకోనుంది.

కీలకం కానున్న కుల సమీకరణాలు..

బీహార్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. సమ్రాట్ చౌదరి ‘కురీ’ వర్గానికి చెందినవారు. నితీష్ కుమార్ నిర్మించిన ‘లవ్-కుష్’ సమీకరణాన్ని కొనసాగించడంలో ఆయన పాత్ర కీలకమవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

నిత్యానంద్ రాయ్ యాదవ్ వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో పెద్ద ఓటు బ్యాంక్. ఇక పాశ్వాన్ దళిత వర్గానికి చెందినవారు కావడంతో, బీజేపీపై ఉన్న ‘అగ్రవర్ణ పార్టీ’ ముద్రను తగ్గించడంలో సహాయపడవచ్చు.

శ్రేయసి సింగ్ యువ నాయకురాలు కావడంతో, యువతకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీగా బీజేపీని చూపించడానికి అవకాశం కలుగుతుంది. మహిళా రిజర్వేషన్ చట్టం ‘నారీ శక్తి వందన్’ నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

‘సర్‌ప్రైజ్’కు అవకాశం..

అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం ఎప్పటిలాగే ఒక ‘సర్‌ప్రైజ్’ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా వర్గాలు కొట్టిపారవేయడం లేదు. గతంలో ఇతర రాష్ట్రాల్లో తక్కువగా గుర్తింపు ఉన్న నాయకులను ముఖ్యమంత్రులుగా నియమించిన ఉదాహరణలను వారు గుర్తుచేస్తున్నారు.

రాజకీయ స్పందనలు..

తృణమూల్ కాంగ్రెస్ నేత శతృఘన్ సిన్హా (Shatrughan Sinha) ఈ పరిణామాలపై స్పందిస్తూ.. బీహార్‌లో అర్హులైన నాయకులు చాలామంది ఉన్నారని, కానీ చివరి నిర్ణయం అనూహ్యంగా ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

మొత్తంగా, నితీష్ కుమార్ రాజీనామా వార్తలతో బీహార్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎన్డీఏలో కొత్త నాయకుడి ఎంపిక రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించనుంది.

Read More
Next Story