
‘బీజేపీ నేతలు చేయొచ్చు.. కాని రాహుల్ చేస్తే తప్ప’
రాహుల్ లేఖకు పూర్తి మద్దతు ప్రకటించిన వయనాడ్ ఎంపీ ప్రియాంక
చైనా సరిహద్దు సమస్యపై ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవాణే రాసిన పుసక్తంలో కీలక విషయాలు బయటపడతాయనే భయంతోనే రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కేంద్రం పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆరోపించారు. పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో మీడియాతో ఆమె కాసేపు మాట్లాడారు. బీజేపీ నాయకులు పుస్తకాలు, మ్యాగజైన్లు, నివేదికల నుంచి కోట్స్ వాడుతున్నపుడు, రాహుల్ గాంధీ వాడితే తప్పేంటని ప్రశ్నించారు. చైనా విదేశాంగ వ్యవహారాలు లేదా పాకిస్తాన్ వంటి అంశాలపై పార్లమెంటులో చర్చ జరగకపోవడం సరైంది కాదని ప్రియాంక అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అయినా, ప్రతిపక్షం అయినా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు. ఎంపీల సస్పెన్షన్ విషయమై ప్రతి సమావేశంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
లోక్సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ రాసిన లేఖకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నానని ప్రియాంక తెలిపారు.
పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రతి అంశంపై చర్చ జరగాలని ఆమె చెప్పారు. నరవాణే పుస్తకంలో చైనా సరిహద్దు సంక్షోభ సమయంలో కేంద్ర నాయకత్వం ఎలా స్పందించిందన్న విషయాలు ఉన్నాయని, అవే బయటపడతాయనే భయంతో ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
‘రెండో రోజూ నో ఛాన్స్..’
నరవాణే జ్ఞాపకాలను ఉటంకించేందుకు రాహుల్ గాంధీకి వరుసగా రెండో రోజు కూడా అనుమతి నిరాకరించడంతో లోక్సభలో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ప్రవర్తనను కారణంగా చూపుతూ 8 మంది ఎంపీలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
సభలో మాట్లాడేందుకు అనుమతి నిరాకరించడాన్ని ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ స్పీకర్కు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన సమయంలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

