
పార్టీ క్యాడర్కు కర్ణాటక హోంమంత్రి వార్నింగ్..
పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్న పరమేశ్వర
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర పార్టీ సహచరులకు హెచ్చరించారు. తమ దృష్టిని అంతర్గత రాజకీయాలపై కాకుండా పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ నాయకత్వంపై బహిరంగంగా వేర్వేరు వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని అన్నారు. ఈ అంశంపై తాను పార్టీ హైకమాండ్తో కూడా మాట్లాడతానని చెప్పారు. ప్రజలు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న సమయంలో నేతలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం హైకమాండ్కు తెలుసని, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఎదురైనప్పుడు పార్టీ అవసరమైన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
ఇటీవల సీఎం సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి ఐదేళ్ల పూర్తి పదవీకాలం కొనసాగుతారని వ్యాఖ్యానించడంతో అంతర్గత చర్చలు మళ్లీ వేడెక్కాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు తమ నాయకుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తున్నారు.
2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య–శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం జరిగిందని, మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు డీకే ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా లోపాయికారి ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇటీవల సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన ముగియడంతో సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

