
బెంగాల్లో బీజేపీ ఎన్నికల వ్యూహం మారిందా?
గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని టీఎంసీని దెబ్బకొంటేందుకు కాషాయ పార్టీ ఏం చేయబోతుంది?
పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నికల వ్యూహాన్ని గణనీయంగా మార్చుకుంది. 2021 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పార్టీ, ఈసారి ప్రచార శైలిని మరింత మృదువుగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తోంది. ఈ మార్పులు భావజాలానికి సంబంధించినవి కాకుండా, ప్రధానంగా విధానంలో మార్పులుగా కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో బీజేపీ ప్రచారం మతపర నినాదాలు, వ్యక్తిగత దాడులపై ఆధారపడింది. ముఖ్యంగా మోదీ, మమతా బెనర్జీ మధ్య ప్రత్యక్ష పోటీలా ప్రచారం సాగింది. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీని నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ, ఈసారి మమతపై ప్రత్యక్ష విమర్శలను తగ్గించి, మరింత సమతుల్యంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఈ వ్యూహ మార్పులో కీలక అంశం సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం. గతంలో టీఎంసీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ముఖ్యంగా మహిళల కోసం అమలు చేసిన “లక్ష్మీర్ భండార్” పథకాన్ని ఉచితాలుగా అభివర్ణించింది. కానీ ఇప్పుడు అదే రంగంలో పోటీకి దిగుతూ, మరింత మెరుగైన ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇస్తోంది. మహిళలకు నెలకు రూ.3వేలు అందించే “అన్నపూర్ణ యోజన”ను ప్రవేశపెడతామని ప్రకటిస్తోంది.
యువతకు ఆర్థిక సాయం..
నిరుద్యోగ యువత కోసం ఉన్న “యువసాథి” పథకంపై కూడా బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. గతంలో విమర్శించిన ఈ పథకానికి బదులుగా, “యువశక్తి” పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావాలని ఆలోచిస్తోంది. అదనంగా, విద్య పూర్తి చేసిన యువతకు రూ.25వేల వరకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీంతో యువత ఓటర్లను ఆకర్షించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
2021లో మమతపై “దీదీ-ఓ-దీదీ” వంటి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. బదులుగా, టీఎంసీ నాయకత్వంపై విమర్శలను కేంద్రీకరిస్తూ, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీపై దృష్టి పెట్టింది.
బెంగాల్ సంస్కృతికి దగ్గరగా..
ఇక హిందుత్వ ప్రచారంలో కూడా మార్పు కనిపిస్తోంది. గతంలో “జై శ్రీరామ్” నినాదాన్ని ప్రధానంగా ఉపయోగించిన బీజేపీ, ఇప్పుడు బెంగాల్కు చెందిన కాళీ, దుర్గ వంటి స్థానిక దేవతలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తోంది. దీంతో బెంగాల్ సంస్కృతితో అనుసంధానం పెంచాలని పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ మార్పు ద్వారా బీజేపీని బయటి పార్టీగా చూపించే టీఎంసీ వాదనను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అభ్యర్థుల ఎంపికలోనూ..
అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అంతర్గత అసంతృప్తి ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటోంది. స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ లోపల సమన్వయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది.
మొత్తంగా, సంక్షేమ పథకాలపై పోటీ, మృదువైన ప్రచారం, స్థానిక సంస్కృతిపై దృష్టి వంటి అంశాలతో బీజేపీ బెంగాల్లో కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ మార్పులు ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

