
తమిళనాడు: డీఎంకేలోకి ఒ పన్నీర్సెల్వం..
"డీఎంకె తిరిగి అధికారంలోకి వస్తుంది. ఎంకె స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు" - OPS
తమిళనాడులో రాజకీయాలు హాట్ మారాయి. పార్టీల్లో చేరికలు జోరందుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బహిష్కృత అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్సెల్వం (OPS) డీఎంకే పార్టీలో చేరారు. 75 ఏళ్ల పన్నీర్సెల్వం, మద్దతుదారులతో కలిసి ఈరోజు (ఫిబ్రవరి 27) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. స్టాలిన్ ఆయనకు ఆలింగన చేసుకుని పార్టీ జెండాను బహుకరించారు. ఆయన సమక్షంలోనే ఓపీఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఓపీఎస్ చేరికతో రెండు ద్రవిడ ప్రధాన నాయకుల మధ్య దశాబ్దాల శత్రుత్వానికి తెరపడింది.
ఈ సందర్భంగా ఓపీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో స్టాలిన్ నేతృత్వంలోని DMK పాలన అద్భుతం అని ప్రశంసించారు. పార్టీ సంక్షేమ పథకాలు, వాటికి వస్తున్న అనూహ్య ప్రజా స్పందన గురించి మాట్లాడారు. "డీఎంకె తిరిగి అధికారంలోకి వస్తుంది. ఎంకె స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు" అని ప్రకటించారు.
ఓపీఎస్ రాజకీయ ప్రయాణం..
జయలలితకు నమ్మిన బంటుగా పేరున్న OPS.. ఆమె ఆసుపత్రిలో చేరి మరణించిన తర్వాత 2001, 2014-2015లో తాత్కాలిక ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. జయలలిత మరణంతో 2016-2017లో కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వీకే శశికళ వర్గం కుట్రల కారణంగా ఆయన స్థానంలోకి ఈపీఎస్ వచ్చారు. జయలలిత మరణానికి న్యాయం కోరుతూ పన్నీర్సెల్వం "ధర్మ యుద్ధం" (ధర్మ పోరాటం) ప్రారంభించారు. తరువాత శశికళ వర్గంతో కొంతకాలం పొత్తు పెట్టుకుని విడిపోయారు.
బీజేపీ మధ్యవర్తిత్వంతో 2017లో EPSతో కలిసి AIADMKలో జాయింట్ కోఆర్డినేటర్గా తిరిగి చేరారు. అయితే 2022లో పార్టీ నుంచి బహిష్కరణకు దారితీసింది. అప్పటి నుంచి ఒక ప్రత్యేక వర్గంగా ఉంటున్నారు. BJP నేతృత్వంలోని NDAతో పొత్తు పెట్టుకున్నాడు అయితే ఒంటరిగా ఉన్నారు. మనోజ్ పాండియన్, వైతిలింగం, మరుదు అళగురాజ్ వంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే DMKలోకి మారిపోయారు.
ఎన్నికలలో పోటీ..
పన్నీర్సెల్వం, ఆయన కుమారుడు, ఆయన విధేయులు 2026 ఎన్నికల్లో డీఎంకే టిక్కెట్లపై పోటీ చేయవచ్చని డీఎంకే ఉన్నత వర్గాలు అంచనా వేస్తున్నాయ. 2021లో ఆయన గెలిచిన తేనిలోని బోడినాయకనూర్ స్థానం నుంచి ఓపీఎస్ పోటీ చేసే అవకాశం ఉంది. "దళపతి నాకు అవకాశం ఇస్తే, నేను పోటీ చేస్తాను" అని ఓపీఎస్ అన్నారు.
'హాట్స్టార్ ఈవెంట్'..
సీనియర్ జర్నలిస్ట్ తరాసు శ్యామ్ ఈ చర్యను తమిళనాడు రాజకీయాల్లో 'హాట్స్టార్ ఈవెంట్'గా అభివర్ణించారు. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నా..కాంగ్రెస్ వంటి కూటమి భాగస్వాములకు ఇది బలమైన సందేశాన్ని కూడా సూచిస్తుందన్నారు. జయలలిత తర్వాత ఇప్పటికే చీలిపోయిన అన్నాడీఎంకేను ఈ పార్టీ ఫిరాయింపు బలహీనపరుస్తుంది. మరోవైపు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే స్థానాన్ని ఇది బలపరుస్తుంది. దక్షిణ తమిళనాడులో ముఖ్యంగా తేనిలో ఓపీఎస్ ప్రభావం అన్నాడీఎంకే స్థావరాన్ని దెబ్బతీస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా.

