
మహిళా ఓటర్లపై డీఎంకే ఫోకస్..
2026 ఎన్నికలకు డీఎంకే భారీ సంక్షేమ అజెండా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే (Dravida Munnetra Kazhagam) మహిళా ఓటర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుని సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ మేనిఫెస్టోలో గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థినులను కేంద్రంగా ఉంచి పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించింది.
గృహిణుల కోసం రూ 8వేలు విలువైన గృహోపకరణాల కూపన్ పథకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కూపన్లను వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, మిక్సర్, ఇండక్షన్ స్టవ్ వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. సబ్సిడీలకు బదులుగా మహిళలకు నేరుగా కొనుగోలు శక్తిని అందించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనను పెంచడమే ఈ పథకం లక్ష్యం.
ఇప్పటికే అమలులో ఉన్న ‘కళైజ్ఞర్ మగళిర్ ఉరిమై తొగై’ పథకాన్ని నెలకు రూ.1000 నుంచి రూ.2,000కు పెంచాలని డీఎంకే నిర్ణయించింది. దీని వల్ల సుమారు 1.39 కోట్ల మహిళలకు స్థిరమైన ఆదాయం లభించనుంది. కూపన్ పథకంతో కలిపి దాదాపు 2 కోట్ల మంది మహిళలు నేరుగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,000 శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు పూచీకత్తు లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలను అందించనుంది. ‘పుదుమై పెన్’ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పెంచి, మహిళల విద్యా, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యువతులను కూడా ఆకర్షించేందుకు పలు చర్యలు ప్రకటించింది. పాఠశాలలలో అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించి, అదనంగా 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చనుంది. రాబోయే ఐదేళ్లలో 35 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు హామీ ఇచ్చింది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి నెలకు రూ.1,500 స్టైపెండ్ ఇవ్వనుంది.
మొత్తం మీద, గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థినులు అనే మూడు కీలక వర్గాల మహిళలను ఆకర్షించే విధంగా డీఎంకే తన వ్యూహాన్ని రూపొందించింది. మహిళలే ఓటర్లలో అధికంగా ఉన్న నేపథ్యంలో, ఈ సంక్షేమ అజెండా ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

