దీపం వివాదం: తిరుప్పరంకుండ్రం ఆలయంపై స్టాలిన్ స్పందన
x

దీపం వివాదం: తిరుప్పరంకుండ్రం ఆలయంపై స్టాలిన్ స్పందన

ప్రధాని మోదీ తిరుప్పరంకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసిన రోజునే స్టాలిన్ వ్యాఖ్యలు


Click the Play button to hear this message in audio format

తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగింపు అంశంపై తలెత్తిన వివాదంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమర్థించారు. వ్యక్తిగత విశ్వాసం రాజకీయాలకు లోబడకూడదని ఆయన స్పష్టం చేశారు. తాను మత నాయకుడిగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలయ సంప్రదాయాలను కాపాడటానికి నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తిరుప్పరంకుండ్రంలో ఉన్న అరుళ్మిఘు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంను సందర్శించి పూజలు చేసిన రోజునే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 1న తన 73వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించే సంప్రదాయం గురించి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసిందన్నారు. మత విశ్వాసం, హేతుబద్ధత పరస్పర విరుద్ధాలు కావని, రెండూ సమాజానికి అవసరమని తెలిపారు. హేతువాద నాయకుడు పెరియార్ ఈ.వి. రామసామి, ఆధ్యాత్మిక నాయకుడు కుంద్రకుడి పొన్నంబల అడిగలర్ మధ్య ఉన్న స్నేహాన్ని ఉదాహరణగా చూపించారు.

ఇక ప్రధాని మోదీ మధురైలో జరిగిన ఎన్‌డీఏ భారీ సభలో మాట్లాడుతూ.. దీపాల వెలిగింపు అంశంపై ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపించారు. చివరికి భక్తులే గెలుస్తారని ఆయన పేర్కొన్నారు.

దీపం వెలిగించే రాతి స్తంభం దర్గా సమీపంలో ఉండటంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కార్తీక దీపోత్సవం రోజున హిందువులు దీపం వెలిగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే, రెండు మతాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.

స్టాలిన్ మాట్లాడుతూ.. “మనకు వేర్వేరు నమ్మకాలు ఉండొచ్చు. కానీ మనం ఒకే దేశంలో జీవిస్తున్నాం. ఒకే భవిష్యత్తు వైపు కలిసి నడవాలి. అదే ద్రవిడ ఉద్యమ సారం” అని అన్నారు. రాజకీయాల్లో తన లక్ష్యం ప్రజలను ఏకం చేయడమేనని తెలిపారు. తమిళం–ఇంగ్లీష్ ద్విభాషా విధానాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, విద్య మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని స్టాలిన్ స్పష్టం చేశారు.

Read More
Next Story