
తమిళనాడు: పార్టీ పదవి నుంచి తప్పుకున్న బీజేపీ నేత అన్నామలై ..
ఎన్నికల్లో ఓటమి భయం కారణంగానే తప్పుకున్నాడన్న కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్..
తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై(K. Annamalai) పార్టీ బాధ్యతల నుంచి వైదొలిగారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా తాను వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని ఆరు నియోజకవర్గాలు - సింగనల్లూరు, విరుగంబాక్కం (చెన్నై), కారైకుడి, శ్రీవైకుంటం, మదురై (దక్షిణ), పద్మనాభపురం (కన్నియాకుమారి) ఇన్చార్జీగా ఉన్నారు.
‘‘అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తా..’’
"నా తండ్రికి డయాలసిస్ జరుగుతోంది. ఆయనను చూసుకోవడం నా బాధ్యత. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేశా. వారు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో పార్టీ ఏదీ చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తా. నా బాధ్యతలను మరొకరిని అప్పగించాలని కూడా కోరాను. నా నిర్ణయాన్ని పార్టీ అంగీకరిస్తుందని భావిస్తున్నా.’’ అని అన్నామలై పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు "పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని, ఆ విషయం మీకు చెబుతాను" అని సమాధానమిచ్చారు. కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అన్నామలై నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి భయం కారణంగానే ఆయన తన బాధ్యత నుంచి తప్పుకున్నారని ఆరోపించారు.

