
యూపీలో ‘రామ్’ పార్టీతో అగ్నిహోత్రి ఎన్నికల రంగంలోకి..
‘రాష్ట్రీయ అధికార్ మోర్చా’ పార్టీని ప్రారంభించిన బరేలీ మాజీ మేజిస్ట్రేట్ .. యూపీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటన
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బరేలీ మాజీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి ‘రాష్ట్రీయ అధికార్ మోర్చా’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 23న ఆయన అధికారికంగా పార్టీని ప్రారంభించారు. రాముడు, కృష్ణుడి సందేశాల ఆధారంగా పార్టీ సిద్ధాంతం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల చిహ్నంగా విల్లు, వేణువును కోరినట్లు చెప్పారు. శంకరాచార్యను అవమానించారని, యూజీసీ నిబంధనలను వ్యతిరేకిస్తూ తాను ప్రభుత్వ సేవ నుంచి రాజీనామా చేసినట్లు గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు తనకు మద్దతు ఇస్తున్నారని ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బీజేపీ సనాతన విలువలను పాటించడం లేదని విమర్శించారు. శంకరాచార్యపై వచ్చిన ఆరోపణలను ఉదాహరణగా చూపించారు. అవసరమైతే కఠిన పోరాటానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.
SC/ST చట్టం, కొత్త యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా తమ పార్టీ ప్రచారం చేస్తుందని తెలిపారు. ఆ నిబంధనలు సామాజిక విభజనకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాల అమలులో అవినీతి జరిగిందని కూడా ఆరోపించారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆ పార్టీ అంతర్గతంగా స్వతంత్రంగా వ్యవహరించడం లేదని అన్నారు. త్వరలో రాజకీయ మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తమ పార్టీ ఎజెండాలో విద్య, ఆరోగ్య రంగాల్లో సాధారణ ప్రజలకు సున్నా ఖర్చు విధానం ఉంటుందని చెప్పారు. అధికారంలోకి వస్తే ఫీజులు సమానంగా చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, పరిపాలనా విభాగాలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే ఆలోచన ఉందని తెలిపారు.
సనాతన విలువల ఆధారంగా పార్టీ నడుస్తుందని, అయితే రాజ్యాంగ చట్రంలోనే అన్ని వర్గాలను కలుపుకుంటామని స్పష్టం చేశారు. యూపీ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

