
తమిళనాడు ఎన్నికలు : పీఎంకేకు పెరంబూర్ సీటు..
టీవీకే చీఫ్ విజయ్ పోటీ నేపథ్యంలో ఎన్డీఏ వ్యూహం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని పీఎంకేకు కేటాయించారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణం కూడా ఉంది. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఏఐఏడీఎంకే నేరుగా పోటీకి దిగకుండా, ఆ సీటును మిత్రపక్షం పీఎంకేకు వదిలేసింది.
ఏప్రిల్ 23న జరిగే ఎన్నికలకు సంబంధించి, కూటమి సీట్ల పంపకాన్ని పరిశీలిస్తే.. బీజేపీ 27 స్థానాలు, పీఎంకే 18, ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగిలిన స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీ చేస్తాయి. కూటమికి నాయకత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో నేరుగా పోటీ చేయనుంది.
పెరంబూర్ ప్రాధాన్యం..
పెరంబూర్ నియోజకవర్గం డీఎంకేకు బలమైన స్థానం. ఇది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గానికి సమీపంలో ఉంటుంది. అందువల్ల విజయ్ పోటీ చేస్తే ఇది కీలక పోరుగా మారే అవకాశం ఉంది.
అన్నామలైకి నిరాశ..
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైకి ఈసారి టికెట్ లభించలేదు. ఆయన కోయంబత్తూరులోని సింగనల్లూరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ, ఆ సీటు బీజేపీకి దక్కలేదు. పార్టీ నిర్ణయంపై స్పందించిన అన్నామలై..తాను సీటు అడగలేదని, కార్యకర్తగా తన పని కొనసాగిస్తానని తెలిపారు.
బీజేపీకి పెరిగిన సీట్లు..
ఈసారి బీజేపీకి 27 స్థానాలు కేటాయించడం గమనార్హం. 2021లో అది 20 స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఎక్కువ సీట్లు రావడం పార్టీ బలం పెరిగిందనడానికి సంకేతం.
ఏఐఏడీఎంకే వ్యూహం..
ఏఐఏడీఎంకే 14 మంది డీఎంకే మంత్రులపై నేరుగా పోటీ చేయకుండా, ఆ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. దీంతో ప్రధాన పోరును పరోక్షంగా నిర్వహించే వ్యూహం కనిపిస్తోంది. అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు పోటీ చేస్తున్న రాధాపురం సీటును కూడా బీజేపీకి కేటాయించారు.
చిన్న పార్టీలకూ అవకాశం..
పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11, తమిళగ మక్కల్ కట్చికి 5, ఇండియన్ జననాయక కచ్చికి 2 స్థానాలు కేటాయించారు. మిగిలిన స్థానాలు ఇతర చిన్న పార్టీలకు ఇచ్చారు. కాగా కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవీ కుప్పం ఎమ్మెల్యే పూవై జగన్మూర్తి సీట్ల పంపకంపై అసహనం వ్యక్తం చేశారు.
ఏఐఏడీఎంకే పతాకం కింద ఎన్డీఏ కూటమి ఏకమై పోటీకి సిద్ధమవుతోంది. ఈసారి 200కు పైగా సీట్లు గెలిచి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పళనిస్వామి గట్టిగా చెబుతున్నారు.

