
ట్రంప్ ప్రసంగంపై విమర్శలు
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడం అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచాయంటున్న నిపుణులు..
ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 20 నిమిషాల ప్రసంగం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టత లేకుండా ఉండటమే కాకుండా, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇరాన్ ఇక పెద్ద ముప్పు కాదని, అమెరికా తన సైనిక లక్ష్యాలను సాధించిందని ట్రంప్ చెప్పారు. అయితే కాల్పుల విరమణపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో రాబోయే రెండు మూడు వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం ఆందోళన కలిగించింది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు వెంటనే కుప్పకూలాయి. పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
‘ట్రంప్ ప్రసంగంలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేదు. యుద్ధం ఎలా ముగుస్తుందో, తదుపరి చర్యలు ఏమిటో చెప్పకపోవడం గందరగోళాన్ని పెంచింది. క్షేత్రస్థాయిలో ఇరాన్ ఇంకా ప్రతిదాడులు కొనసాగిస్తుండగా, అది బలహీనపడినట్లు ఎక్కడా కనిపించడం లేదు’ అని నిపుణులు అంటున్నారు.
అంతేకాకుండా, ట్రంప్ వ్యాఖ్యలు శాంతి దిశగా కాకుండా ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కొందరు నిపుణులు ఈ నిర్ణయాలపై బాహ్య ప్రభావం ఉండవచ్చని కూడా సూచించారు.
హర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ కీలక చమురు మార్గాన్ని రక్షించుకోవడం ఇతర దేశాల బాధ్యత అని ఆయన చెప్పడం, అమెరికా సంప్రదాయ విధానంలో మార్పుగా భావిస్తున్నారు.
మొత్తంగా, ట్రంప్ ప్రసంగం ప్రపంచ స్థాయిలో అనిశ్చితి, ఆందోళనలను పెంచిందని, శాంతి దిశగా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంలో విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

