
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, శాంతి పునరుద్ధరణ, హోర్ముజ్ జలసంధి గురించి ఎక్కువగా చర్చించినట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులపై విస్తృతంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఉద్రిక్తతలను తగ్గించి, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడం చాలా అవసరమని, ఇందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ తెలిపారు.
అలాగే హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యతను గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో.. దాన్ని ఎప్పటికీ తెరిచి ఉంచడంతో పాటు సురక్షితంగా ఉంచాలని కోరినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
ఇద్దరి సంభాషణలో ప్రధానంగా.. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, శాంతి పునరుద్ధరణ గురించి, హోర్ముజ్ జలసంధి భద్రతపై ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం.

