
పశ్చిమాసియా ఘర్షణల్లో ఆరుగురు భారతీయులు మృతి, ఒకరు గల్లంతు
భారత్కు కొనసాగుతోన్న విమాన సర్వీసులు..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో ఆరుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం (మార్చి 20) ధృవీకరించింది. ఈ ఘటనలతో భారతీయుల భద్రతా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
"వివిధ ఘటనల్లో దురదృష్టవశాత్తూ ఆరుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. మేం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం,’’ అని గల్ఫ్ అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్. మహాజన్ తెలిపారు. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యూఏఈలోని అధికారులతో సంప్రదింపుల అనంతరం మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మెరుగుపడ్డ ప్రయాణ పరిస్థితులు..
గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటికే చాలామంది ప్రయాణికులు భారత్కు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 28 నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా నుంచి కూడా విమానాల సర్వీసులు కొనసాగుతున్నాయి. ఖతార్ గగనతలం పాక్షికంగా తిరిగి తెరుచుకోవడంతో ఖతార్ ఎయిర్వేస్ ఈ రోజు 10 నాన్-షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలను నడిపింది.
ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కువైట్ గగనతలం మూసివేసిన నేపథ్యంలో.. కువైట్ ఎయిర్వేస్ ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ విమానాన్ని కొచ్చికి పంపింది. బహ్రెయిన్ కూడా గగనతలం మూసివేయడంతో గల్ఫ్ ఎయిర్ దమ్మామ్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను తీసుకొస్తుంది.

