‘‘భారత్ ఎన్నటికి మూడో పక్షం జోక్యం అంగీకరించదు’’
x
భారత ప్రధాని నరేేంద్ర మోదీతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

‘‘భారత్ ఎన్నటికి మూడో పక్షం జోక్యం అంగీకరించదు’’

ఆపరేషన్ సిందూర్ లో ట్రంప్ ప్రమేయం ఏ మాత్రం లేదని ఆయనకే చెప్పిన ప్రధాని మోదీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ ను కేవలం పాకిస్తాన్ అభ్యర్థన మేరకు విరామం ఇచ్చామని, అమెరికా మధ్యవర్తిత్వం, లేదా వాణిజ్యచర్చల వల్ల కాదని స్పష్టం చేశారు.

మోదీ, ట్రంప్ తో దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ గురించి అమెరికా అధ్యక్షుడికి విపులంగా వివరించారు.
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు కచ్చితంగా దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గత నెలలో పాకిస్తాన్ తో సైనిక ఘర్షణ తరువాత మోదీ తొలిసారిగా ట్రంప్ తో మాట్లాడారు.
మూడో పక్షాన్ని అంగీకరించం..
‘‘ఆపరేషన్ సిందూర్ కు విరామం ఇవ్వడానికి, వాణిజ్యానికి ఎటువంటి సంబంధం లేదని ఈ అంశాలు చర్చకు రాలేదని ప్రధాని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ కూడా మూడో పక్షం జోక్యం అంగీకరించబోదని, భవిష్యత్ లో కూడా అలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ఆయన గట్టిగానే చెప్పారు’’ అని మోదీ- ట్రంప్ ఫోన్ కాల్ పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
జీ-7 సమావేశానికి హజరుకావడానికి కెనడాలోని కననాస్కిస్ లో ఉన్న మోదీని, కెనడా నుంచి తిరుగు ప్రయాణంలో అమెరికాను సందర్శించమని ట్రంప్ ఆహ్వానించారని ఆయన చెప్పారు.
అయితే ముందుగా ఉన్న షెడ్యూల్ కారణంగా తాను ఆహ్వానాన్ని అంగీకరించలేనని మోదీ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ సమావేశం కోసం భారత్ కు రావాలని మోదీ, ట్రంప్ ను ఆహ్వానించారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ట్రంప్ జీ -7 సమావేశం నుంచి అర్థాంతరంగా వైదొలిగారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ట్రంప్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు ఆయన మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్నారు.
భారత్ ప్రతిస్పందన..
ట్రంప్ తో జరిగిన ఫోన్ సంభాషణలో.. పాక్ దాడులకు భారత్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించిందని, మే 9, 10 తేదీల మధ్య దాని సైనిక ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని, వారి వైమానిక స్థావరాలు పనిచేయకుండా పోయాయని మోదీ, ట్రంప్ కు చెప్పారు.
పాకిస్తాన్ కు భారత్ ఇచ్చిన బలమైన దాడుల కారణంగానే సైనిక దాడులు ఆపమని తమను వేడుకున్నారని మోదీ, ట్రంప్ కు చెప్పారు. ఈ మొత్తం సంఘటనలో భారత్- అమెరికా మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని, భారత్- పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ప్రధాని ట్రంప్ కు స్పష్టం చేసినట్లు మిస్రీ అన్నారు.
భారత్- పాకిస్తాన్ మధ్య ఉన్న మార్గాలను ఉపయోగించి, పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ప్రత్యక్ష చర్చల ద్వారా సైనిక చర్యను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు మోదీ చెప్పారు.
పాకిస్తాన్ - భారత వ్యవహరాల్లో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని ఈ విషయంలో రెండు దేశాల్లో ద్వైపాక్షిక రాజకీయ ఐక్యత ఉందని ప్రధాని స్పష్టం చెప్పినట్లు సమాచారం.
ట్రంప్ మద్దతు..
ప్రధానమంత్రి మాటలు విన్నాక ట్రంప్ విషయం అర్థం చేసుకున్నారని, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారని మిస్రీ చెప్పారు.
‘‘భారత్ ఇక పై ఉగ్రవాదాన్ని ప్రాక్సీ యుద్దంగా భావించదని, నేరుగా యుద్ధ చర్యగా పరిగణిస్తుందని మోదీ ట్రంప్ తో అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇప్పటికి కొనసాగుతోంది’’ అని మిస్రీ అన్నారు.
జీ-7 సమావేశం సందర్బంగా మోదీ, ట్రంప్ సమావేశం కావాల్సి ఉండేది. అయితే అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో అది జరగలేదని విదేశాంగ కార్యదర్శి అన్నారు.
మోదీతో మాట్లాడాలని ట్రంప్ కోరుకున్నారని, అందుకే ఫోన్ కాల్ సంభాషణ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పహల్గామ్ తరువాత ఉగ్రవాదం పై చర్యలు తీసుకునే తన దృఢ సంకల్పాన్ని మోదీ, ట్రంప్ ముందు వ్యక్తం చేశారని అన్నారు.
తీవ్రతరం కానీ చర్య..
మే 6-7 తేదీల మధ్య భారత్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని భారత్, అమెరికాకు వివరించింది. భారత్ కచ్చితమైన తీవ్రతరం కాని దాడులు చేసిందని మోదీ, ట్రంప్ కు చెప్పారు.
పాకిస్తాన్ నుంచి వచ్చే బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం( గోలి కా జవాబ్ గోలే సే దియా జాయేగా) ఇస్తామని తాము ప్రకటించినట్లు మోదీ అన్నారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, పాకిస్తాన్ చేసే పెద్దదాడి గురించి హెచ్చరించానని ప్రధాని ట్రంప్ తో చెప్పారని మిస్రీ అన్నారు. పాకిస్తాన్ అలా చేస్తే భారత్ మరింత పెద్ద స్థాయిలో స్పందిస్తుందని మోడీ వాన్స్ తో స్పష్టంగా చెప్పారని మిస్రీ చెప్పారు.
మరికొన్ని అంశాలు చర్చకు..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం గురించి కూడా అధ్యక్షుడు ట్రంప్, మోదీ చర్చించారని మిస్రీ అన్నారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంపై ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా శాంతి స్థాపనకు ఇరుపక్షాల మధ్య ప్రత్యక్ష చర్చలు అవసరమని ఈ దిశగా ఇరువురు నాయకులు అంగీకరించారని అన్నారు.
ఇండో - పసిఫిక్ ప్రాంతంపై ట్రంప్- మోదీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో క్వాడ్ పోషించే ముఖ్యమైన పాత్రకు మద్దతు ప్రకటించారు. తదుపరి క్వాడ్ సమావేశానికి భారత్ ను సందర్శించాలని అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని ఆహ్వానించారని, అమెరికా అధ్యక్షుడు దీనిని అంగీకరించారని, భారత్ ను సందర్శించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ చెప్పినట్లు మిస్రీ అన్నారు.
Read More
Next Story