
ఇరాన్లో చిక్కుకున్న కాశ్మీరీ విద్యార్థులు..
సురక్షితంగా భారత్కు తరలించాలని వేడుకోలు
ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య వందలాది భారతీయ విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది జమ్మూ-కాశ్మీర్కు చెందిన మెడికల్ విద్యార్థులే కావడం ఆందోళన కలిగిస్తోంది. నిరంతర దాడుల కారణంగా వారు హాస్టళ్లలోని బంకర్లలోనే తలదాచుకుంటూ, తక్షణం భారత్కు తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న లబీబ్ ఖాద్రి ప్రస్తుతం ఉర్మియా యూనివర్సిటీ హాస్టల్లో సుమారు 109 మంది భారతీయ విద్యార్థులతో కలిసి ఉన్నాడు. గత నాలుగు రోజులుగా వారు బయటకు వెళ్లలేకపోతున్నారని తెలిపాడు. హాస్టల్కు కేవలం 300 మీటర్ల దూరంలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం కంపించిందని ఆయన చెప్పాడు. గత సంవత్సరం జరిగిన దాడుల కంటే ప్రస్తుతం పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని వివరించాడు.
గత ఏడాది ఉద్రిక్తతల సమయంలో భారత్కు తిరిగి వెళ్లిన ఖాద్రి, చదువు పూర్తిచేయాల్సి ఉండడంతో మళ్లీ ఇరాన్కు వెళ్లాడు. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి సర్దుకుంటుందని కుటుంబం భావించింది. కానీ ఆకస్మికంగా దాడులు ప్రారంభమవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఉర్మియా నగరంలో ఐదు రోజులుగా నిరంతర దాడులు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. రోజంతా ఫైటర్ జెట్ల శబ్దం వినిపిస్తోందని, విశ్వవిద్యాలయం ఆహారం అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు నీరు కూడా అందుబాటులో ఉండడం లేదని వారు తెలిపారు.
ఇక క్వామ్ ప్రావిన్స్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ చదువుతున్న ఎంబిబిఎస్ విద్యార్థి ఫైసల్ లతీఫ్ మాట్లాడుతూ హరమ్ ప్రాంతం సమీపంలో మూడు పేలుళ్లు సంభవించాయని చెప్పారు. ఎక్కడ చూసినా దాడులు జరుగుతుండటంతో తీవ్ర భయం నెలకొందని తెలిపారు. మార్కెట్లలో అవసరమైన వస్తువులు దొరకడం కూడా కష్టంగా మారిందని చెప్పారు.
విమాన సౌకర్యం పరిమితంగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే దేశం విడిచి వెళ్లలేకపోయారు. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో టిక్కెట్లు ఉన్నప్పటికీ, వారానికి ఒక్కటి లేదా రెండు విమానాలే ఉండటంతో ప్రయాణం సాధ్యం కాలేదని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జమ్మూ-కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరింది. పరిస్థితి అనుమతిస్తే పొరుగున ఉన్న ఆర్మేనియా మార్గంగా తరలింపు చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇరాన్లో చిక్కుకున్న కాశ్మీర్ విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకురావాలనే డిమాండ్ కాశ్మీర్ ప్రజల్లో పెరుగుతోంది. ప్రస్తుతం విద్యార్థులంతా భారత ఎంబసీ నుంచి త్వరిత చర్యల కోసం ఎదురు చూస్తున్నారు.

