
‘ఉగ్రవాదం అంతుచూస్తాం’
టెర్రరిస్టులను, వారికి మద్దతిస్తున్న వారిని వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరించిన ప్రధాని మోదీ
ఉగ్రవాదుల పట్ల భారత్ వైఖరిని ప్రధాని మోదీ(PM Modi) మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రమూకలనే కాదు. వారి మద్దతుదారులనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అంగోలా(Angola) అధ్యక్షుడు జువా మనువెల్ గొంజాల్వెజ్ లౌరెన్సా( Joao Manuel Goncalves Lourenco)తో శనివారం ప్రధాని భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పహల్గాం ఉగ్రదాడి అంశంపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. టెర్రరిస్టులను ప్రోత్సహించే దేశాలతో భారత్ ఎలాంటి సంబంధాలు కొనసాగించదని చెప్పారు.
పాకిస్తాన్ దిగుమతులపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. తపాలా సేవలను నిలిపివేసింది. భారత పోర్టుల్లో పాకిస్తాన్ జెండా ఉన్న నౌకల ప్రవేశంపై నిషేధం విధించింది.
కుదిరిన ఒప్పందాలు..
మోదీ–లౌరెన్సా చర్చల సందర్భంగా భారత్, అంగోలా మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యం, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యం కుదిరింది. అంగోలా నూనె, గ్యాస్ కొనుగోలుదారుల్లో భారత్ అతిపెద్ద కొనుగోలుదారు అని మోదీ చెప్పారు. అంగోలా రక్షణ విభాగం ఆధునికీకరణ కోసం 200 మిలియన్ డాలర్ల ఇస్తున్నట్లు ప్రకటించారుర. అంగోలాలో యోగా, బాలీవుడ్కు ఉన్న ఆదరణ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బలాన్ని సూచిస్తుందన్నారు. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్లో అంగోలా చేరికను స్వాగతిస్తున్నామన్నారు. డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూటమి, బిగ్ క్యాట్ అలయెన్స్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ లాంటి భారత ప్రాయోజిత అంతర్జాతీయ కూటముల్లో కూడా చేరాలని ఆహ్వానించారు. భారత్ G20 సమ్మిట్కు అధ్యక్షత వహించిన సమయంలో..అఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం లభించడం గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు.