
చైనా అగ్రి టెర్రరిజానికి పాల్పడుతోందా?
అమెరికాలో వ్యవసాయ ఉగ్రవాదానికి చైనా ప్లాన్ చేసిందా? ప్రమాదకర ఫంగస్ ద్వారా అగ్రరాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలనుకున్నారా?
చైనా(China)కు చెందిన పరిశోధకులు జియాన్ యున్కింగ్ (33), లియు జున్యాంగ్ (34)లను అమెరికా(America) అరెస్టు చేసింది. తన స్నేహితురాలు జియాన్ పనిచేసే మిచిగాన్ యూనివర్సిటీ లాబోరేటరీలో పరిశోధన కోసం ‘‘ఫ్యూసేరియం గ్రామినారమ్’’ అనే ప్రమాదకర ఫంగస్ను లియు తన బ్యాగులో రహస్యంగా దాచి అమెరికాలోకి తీసుకొచ్చాడన్నది అమెరికా దర్యాప్తు సంస్థ FBI అధికారులు చెబుతున్నారు. ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటలకు "హెడ్ బ్లైట్" అనే తెగుళ్లు సోకుతుంది. పశువులు, ప్రజలను అనారోగ్యానికి గురవుతారు. ఫలితంగా భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
చైనాలో ఈ ఫంగస్పై పరిశోధన చేయడానికి జియాన్ ఆ దేశం నుంచి నిధులు కూడా పొందినట్టు FBI గుర్తించింది. వ్యవసాయ ఉగ్రవాద (Agroterrorism) ఆయుధంగా ఈ బయోలాజికల్ ప్యాథోజన్ను వాడేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది.
భారత్పై ప్రభావం చూపనుందా?
వ్యవసాయంపై ఆధారపడ్డ భారతదేశంలో ఈ రకమైన ఉగ్రవాదం పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు. పాక్, చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ వ్యవసాయ-ఉగ్రవాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2016లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో.. బంగ్లాదేశ్లోని విషపూరిత శిలీంధ్రం పశ్చిమ బెంగాల్లోని రెండు జిల్లాల్లో కనిపించిందని పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో గోధుమల సాగును మూడు సంవత్సరాల పాటు నిషేధించడం ద్వారా తెగుళ్లను అరికట్టగలిగింది.