
21 రోజుల తర్వాత BSF జవాన్ విడుదల..
సరిహద్దులో ఉన్న BSF అధికారుల వివరాలు చెప్పాలంటూ పాక్ అధికారుల ఒత్తిడి..
ఎట్టకేలకు పాక్ కస్టడీలోని ఉన్న BSF జవాన్ను విడిచిపెట్టారు. మే 14వ తేదీ టారి-వాఘా సరిహద్దులో అతన్ని తిరిగి భారత్ భద్రతా దళాలకు అప్పగించారు. 24వ BSF బటాలియన్కు చెందిన పూర్ణం కుమార్ షా పాక్ కస్టడీలో 21 రోజులున్నారు. ఆ సమయంలో సరిహద్దులో ఉన్న BSF అధికారుల వివరాలు చెప్పాలంటూ పాక్ బలగాలు(Pakistan military) ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాకు చెందిన పూర్ణం కుమార్ షా.. ఫిరోజ్పూర్ సెక్టార్లో విధి నిర్వహణలో ఉన్న సమయంలో పొరపాటుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. దాంతో ఆయనను పాక్ రెంజర్లు అదుపులోకి తీసుకున్నారు. కళ్లకు గంతలు కట్టి మూడు గోప్యమైన ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి విమాన స్థావరానికి సమీపంలో ఉండొచ్చని, అక్కడ తనకు విమాన శబ్దాలు వినిపించాయని షా చెప్పారు.
BSF అధికారుల వివరాలు చెప్పాలని ఒత్తిడి..
ఇండియా టుడే ప్రకారం.. భారత్-పాక్ బార్డర్లో మోహరించిన BSF అధికారులు వివరాలు పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని పాక్ రేంజర్లు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే తన వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడం ఆ వివరాలు ఇవ్వలేకపోయారు.
యుద్ధ విరమణ తర్వాత విడుదల..
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మూడు రోజులకు పాకిస్తాన్ షాను విడుదల చేసింది. మే 14వ తేదీ ఉదయం 10:30 ప్రాంతంలో అమృత్సర్లోని అటారి జాయింట్ చెక్ పోస్టులో ఆయనను BSFకి అప్పగించారు.
"కానిస్టేబుల్ షా, ఏప్రిల్ 23 వ తేదీ ఉదయం 11:50 గంటల ప్రాంతంలో ఫిరోజ్పూర్ సెక్టార్లో విధుల్లో ఉన్న సమయంలో పొరపాటుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. అక్కడి రెంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మే 14వ తేదీ ఉదయం 10:30కి అటారి-వాఘా సరిహద్దులో అతన్ని తిరిగి భారత్ భద్రతా దళాలకు అప్పగించారు, " అని పేర్కొంది. అనంతరం ఆయనకు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం షా శారీరక, మానసికంగా స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.