పారిస్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ టీజర్
x

పారిస్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ టీజర్

ఫ్రాన్స్‌లో టీజర్ విడుదలైన తొలి భారతీయ చిత్రం 'వారణాసి'


భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం కేవలం తెలుగు సినిమాగానే కాకుండా, హాలీవుడ్ ప్రమాణాలతో ఒక గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుండి అటు మహేష్ అభిమానుల్లో, ఇటు అంతర్జాతీయ సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పారిస్‌లో అరుదైన మైలురాయి

ఈ చిత్రం ఇప్పటికే ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని సుప్రసిద్ధ ‘లీ గ్రాండ్ రెక్స్’ థియేటర్‌లో నిన్న (జనవరి 5, 2026) రాత్రి ప్రదర్శించారు. ఐరోపాలోనే అతిపెద్ద మరియు ఐకానిక్ థియేటర్‌గా పేరుగాంచిన ఇక్కడ ఒక భారతీయ సినిమా టీజర్‌ను ఆవిష్కరించడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ పంపిణీ సంస్థ 'అన్నా ఫిల్మ్స్' అట్టహాసంగా నిర్వహించింది.

భారీ బడ్జెట్ - భారీ తారాగణం

ఈ చిత్రాన్ని సుమారు రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోషియో-ఫాంటసీ, టైమ్ ట్రావెల్ అంశాలతో సాగే ఈ అడ్వెంచర్ మూవీని పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు.

రాజమౌళి ఆస్థాన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఈ సినిమా, భారతీయ సినిమా శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పబోతోంది. ఈ అద్భుత దృశ్య కావ్యం 2027 ఏప్రిల్ 9న శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read More
Next Story