సాయి పల్లవి వైరల్ ఫోటోపై భారీ రచ్చ!
x

సాయి పల్లవి వైరల్ ఫోటోపై భారీ రచ్చ!

ఒక AI ఫోటో… వేల కామెంట్లు!


టాలీవుడ్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్‌కు మరో పేరు అనిపించే నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘రామాయణం’ లో సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నాడు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో హఠాత్తుగా వైరల్ కావడంతో ఈ సినిమా చుట్టూ కొత్త వివాదం మొదలైంది.

వైరల్ ఫోటో… కానీ అది అసలు కాదు

సోషల్ మీడియాలో రాముడు-సీత గెటప్‌లో ఉన్న రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. చాలామంది అది సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన ఒరిజినల్ స్టిల్ అనుకున్నారు.

కానీ నిజానికి అది AI జనరేట్ చేసిన ఫోటో.

ఇంటర్నెట్‌లో ఎవరో రూపొందించిన ఈ డిజిటల్ ఇమేజ్‌ను చాలా మంది నిజమని నమ్మేశారు. అంతే కాదు, ఆ ఫోటో ఆధారంగా సాయి పల్లవిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు కొంతమంది ఆమెకు సీత పాత్రకు కావాల్సిన “రాయల్ లుక్” లేదని విమర్శించటం మొదలెట్టారు. ఇంకొందరు గతంలో ఆమె పాకిస్దాన్ విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను బయటకు తీసి మరీ సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

AI యుగంలో నిజం-అబద్ధం మధ్య గీత మాయమవుతోంది

ఇది కేవలం ఒక హీరోయిన్‌పై వచ్చిన ట్రోలింగ్ మాత్రమే కాదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెరుగుతున్న ఒక పెద్ద సమస్యకు ఉదాహరణ AI మిస్ఫర్మేషన్. ఇప్పుడు కృత్రిమ మేధ సహాయంతో ఫోటోలు, వీడియోలు, వాయిస్‌లు, ఏవైనా చాలా నిజమైనట్టు తయారు చేయడం సులభమైంది. దాంతో అసలు సమస్య ఏమిటంటే… ప్రజలు ముందుగా నమ్మేస్తున్నారు. తర్వాతే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒకప్పుడు ఫోటో అంటే నిజం అనే భావన ఉండేది. ఇప్పుడు అదే ఫోటో నిజమా లేక AI సృష్టించిందా అన్నది గుర్తించడం చాలా కష్టం. ఇది సెలబ్రిటీలకే కాదు, సాధారణ ప్రజలకూ పెద్ద సమస్యగా మారుతోంది.

సోషల్ మీడియా తీర్పులు – పరిశీలన లేకుండా విమర్శలు

ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… చాలామంది ఆ ఫోటో నిజమా కాదా అన్నది చెక్ చేయకుండానే కామెంట్లు చేయడం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది చాలా సాధారణంగా మారిపోయింది. ఒక ఫోటో వైరల్ అవుతుంది. కొంతమంది దానిపై కామెంట్లు చేస్తారు. అవి మరింత వైరల్ అవుతాయి. ఇలా సత్యం కంటే స్పందన వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడింది.

సాయి పల్లవి – మేకప్ కాదు, నటనతో నిలిచిన స్టార్

ఈ వివాదం మధ్య ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుచేసుకోవాలి. సాధారణంగా స్టార్ హీరోయిన్స్‌ను గ్లామర్ లేదా స్టైల్‌తో గుర్తిస్తారు.

కానీ సాయి పల్లవి విషయంలో పరిస్థితి భిన్నం.సాయి పల్లవి గురించి మాట్లాడితే, చాలామంది ఇప్పటికీ ఆమెను నటనతో గుర్తించే నటిగా చూస్తాము. ఆమె కెరీర్‌ మొదటి నుంచే చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.

‘ఫిదా’, ‘ప్రేమమ్’, ‘గార్గి’, ‘విరాటపర్వం’ వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను గట్టిగా కట్టిపడేసింది. ఆమె పాత్రల్లో కనిపించే సహజత్వం, అమాయకత్వం , భావోద్వేగ తీవ్రత వల్లే ఆమెను “నేచురల్ స్టార్”గా అభిమానులు పిలుస్తున్నారు.

ఇక సీత పాత్రకు అవసరం లుక్ కాదు… భావం

సీత పాత్ర గురించి మాట్లాడితే చాలామంది ముందుగా గుర్తు చేసేది రాజసికమైన రూపం. కానీ రామాయణంలో సీత పాత్ర అసలు బలం ఆమె వ్యక్తిత్వం. ఆమె ధైర్యం, సహనం, పవిత్రత, ఆత్మగౌరవం వల్లే ఆ పాత్ర శాశ్వతంగా నిలిచింది. అందుకే చాలా మంది సీనియర్స్ ఒక విషయాన్ని చెబుతున్నారు . సీత పాత్రకు మేకప్ కంటే నటన ముఖ్యం. అదే కారణంగా దర్శకుడు నితీష్ తివారీ కూడా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా విడుదలకు ముందే తీర్పు?

ఈ మొత్తం వివాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. టీజర్ కూడా విడుదల కాలేదు.

అయినా సోషల్ మీడియాలో ఇప్పటికే కొందరు “సినిమా ఫ్లాప్ అవుతుంది” అనే తీర్పులు ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఆధునిక సోషల్ మీడియా సంస్కృతి యొక్క మరో లక్షణం.

ఏదైమైనా

AI టెక్నాలజీ అభివృద్ధి అవడం తప్పు కాదు. కానీ దాన్ని ఉపయోగించే విధానం చాలా ముఖ్యం. ఈ ఘటన ఒక విషయం గుర్తు చేస్తోంది. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో చూసింది నిజమా కాదా అన్నది తెలుసుకోవడం కూడా ప్రేక్షకుల బాధ్యత. సాయి పల్లవి విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఒక AI ఫోటో ఆధారంగా ఒక నటిని తీర్పు చెప్పడం కంటే, ఆమె నటనను చూసి నిర్ణయం తీసుకోవడం సరైనది.

Read More
Next Story