
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో భారత్ పురోగతి
భారీగా పెరిగిన వెండి ఆభరణాల ఎగుమతులు..
ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక ఒడిదొడుకుల మధ్య కూడా భారతదేశ రత్నాలు, ఆభరణాలు ఎగుమతుల్లో వృద్ధిని నమోదు చేశాయి. ఫిబ్రవరిలో ఈ రంగం దాదాపు 4 శాతం వృద్ధిని సాధించింది.
రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (GJEPC) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 ఫిబ్రవరిలో భారతదేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3.86 శాతం పెరిగి 2,680.79 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.24,340.05 కోట్లకు సమానం. గత సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 2,581.08 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే దాదాపు రూ.22,460.13 కోట్లు.
2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం ఎగుమతులు కూడా దాదాపు స్థిరంగా కొనసాగాయి. ఈ కాలంలో మొత్తం ఎగుమతులు 25,933.72 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో అవి 25,915.81 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
GJEPC చైర్మన్ కిరిత్ భన్సాలీ మాట్లాడుతూ.. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు పరిశ్రమపై ప్రభావం చూపాయని, అయితే ఈ పరిస్థితుల్లో కూడా రత్నాలు, ఆభరణాల ఎగుమతిలో భారత్ బలంగా నిలబడిందని పేర్కొన్నారు.
వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు..
తమ మార్కెట్లను విస్తరించడానికి భారత ఎగుమతిదారులు ప్రయత్నించారని చెప్పారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తమ ఉనికిని చాటుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఎగుమతులకు సహాయపడ్డాయని చెప్పారు. హాంకాంగ్ వంటి మార్కెట్లు కూడా భారత ఎగుమతులకు స్థిరమైన మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.
అమెరికా సుంకాల విధానాల్లో చోటుచేసుకున్న కొన్ని మార్పులు, స్టడెడ్ జ్యువెలరీకి కొంత మద్దతు ఇచ్చాయని చెప్పారు. అయితే సహజ వజ్రాలు, కొన్ని వదులుగా ఉన్న రాళ్లపై తుది సుంకాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం వీటిపై 10 శాతం దిగుమతి సుంకం అమలులో ఉంది అని చెప్పారు.
GJEPC వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో కట్, పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి. ఇవి 0.84 శాతం తగ్గి 1,351.17 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో అవి 1,362.67 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అయితే ప్రయోగశాలలో తయారైన పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు పెరిగాయి. ఇవి 1.85 శాతం పెరిగి 111.68 మిలియన్ డాలర్ల నుంచి 113.74 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
బంగారు ఆభరణాల ఎగుమతులు కూడా వృద్ధిని నమోదు చేశాయి. ఫిబ్రవరిలో ఇవి 3.23 శాతం పెరిగి 928.85 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో బంగారు ఆభరణాల ఎగుమతులు 899.82 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
వెండి ఆభరణాల ఎగుమతులు అయితే భారీగా పెరిగాయి. ఇవి 123.77 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫిబ్రవరిలో వెండి ఆభరణాల ఎగుమతులు 116.37 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో అవి 52.01 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఎగుమతిదారులు పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తూ తమ వాణిజ్య భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నారని భన్సాలీ తెలిపారు. ఎగుమతులు, సరఫరా వ్యవస్థలు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.

