సెంట్రల్ బడ్జెట్ పై ఇండస్ట్రీ రియాక్షన్
x
టీవీలో కేంద్ర బడ్జెట్ ను వింటున్న సీఐఐ ప్రతినిధులు

సెంట్రల్ బడ్జెట్ పై ఇండస్ట్రీ రియాక్షన్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ శాఖ లోని వివిధ రంగాల్లో నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ను సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆంధ్రప్రదేశ్ శాఖ స్వాగతించింది. విజయవాడలోని మురళీ ఫార్చ్యున్ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, సీఐఐ నాయకులు మాట్లాడారు. బడ్జెట్‌లో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సానుకూలమని వారు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమగ్రమైనది, ప్రగతి సాధనకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.


విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీఐఐ ప్రతినిధులు

సీఐఐ మాజీ చైర్మన్, సుజయ్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ధన్ ధన్య కృషి యోజన, గ్రామీణ సంపన్నత, స్థిరత్వ కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి పరివర్తనాత్మకమైన చర్యలు అని అన్నారు. ఇవి సాగునీటి సదుపాయాలు, రుణాల లభ్యత పెంపు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పారు. బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని, గ్రామీణ సంపన్నతను పెంచుతుందని వివరించారు.


సీఐఐ మాజీ చైర్మన్ లక్ష్మీ ప్రసాద్.

సీఐఐ మాజీ చైర్మన్ దివి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లకు పెరిగిన క్రెడిట్ గ్యారంటీ కవర్, కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు ఎంఎస్‌ఎంఈల ప్రగతికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇవి చిన్న వ్యాపారాలకు అవసరమైన ఆర్థిక మద్దతు అందించి, విస్తరణకు, ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయని చెప్పారు.


దివి రవీంద్రనాథ్ రెడ్డి

సీఐఐ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ బడ్జెట్ ఎంఎస్‌ఎంఈలు, ఉద్యమశీలత, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. పెరిగిన పెట్టుబడులు, టర్నోవర్ పరిమితులు ఆవిష్కరణలు, ఉద్యమశీలతను ప్రోత్సహిస్తాయని వివరించారు. వ్యవసాయం, మినరల్స్ రంగంలో సంస్కరణలు వచ్చాయన్నారు.


సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ కిరణ్

పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడ్జెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మూడేళ్ల పైప్‌లైన్, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లు ప్రోత్సాహం రంగానికి కీలకమని అన్నారు. ఎన్విరాన్ మెంట్ కూడా ఈ బడ్జెట్ బాగా ఉపయోగ పడుతుందని అన్నారు. స్పోర్ట్స్ రంగంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తుందని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అనుకూలంగా ఉందన్నారు.


వెంకటేశ్వరరావు

టెక్సోరా చైర్మన్ అశోక్ కొల్లా మాట్లాడుతూ బడ్జెట్ టెక్స్‌టైల్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, ఉద్యోగాల సృష్టి, పెట్టుబడులు ఆకర్షించడానికి కొత్త స్కీమ్‌లు ప్రకటించడం స్వాగతనీయమని అన్నారు. భారత్ విస్తార్ పథకానికి రూ. 5వేల కోట్లు కేటాయించటం ద్వారా ఏఐ రంగంలో భారీ మార్పులు వస్తాయని చెప్పారు. జీఎస్టీ రేషనలైజేషన్ జరుగుతుందని చెప్పారు. క్వాంటమ్ కూడా ఇండియాలో ముందడుగు వేస్తుందన్నారు.


అశోక్ కొల్లా

విట్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ అరుళ్ మోజ్ హివర్ మెన్ మాట్లాడుతూ విద్యా రంగంలో ఆవిష్కరణలు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్టార్టప్‌లకు కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డారు. విద్య, సాంకేతికతలకు దృష్టి సారించడం ప్రశంసనీయమని చెప్పారు.


అరుళ్ మోజ్ హివర్ మెన్

టెక్స్ టైల్ రంగ నిపుణులు బీఎస్ కోటేశ్వరావు మాట్లాడుతూ బడ్జెట్ టెక్స్‌టైల్ రంగానికి మద్దతు ఇచ్చి, ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్ కొత్త స్కీమ్ 22 లక్షల ఉద్యోగాలు సృష్టించి, రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అన్నారు.


బీఎస్ కోటేశ్వరావు

పారిశ్రామికవేత్త మొవ్వ రామకృష్ణ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యత పెంచడం, పెట్టుబడులు, టర్నోవర్ పరిమితులు పెంచడం తయారీ రంగానికి గణనీయమైన ప్రోత్సాహం అని అన్నారు. పెరిగిన క్రెడిట్ గ్యారంటీ కవర్ కార్యకలాపాలు విస్తరించడానికి, ఆర్థిక వ్యవస్థకు మరింత సమర్థవంతంగా దోహదపడటానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

సీఐఐ విజయవాడ జోన్ చైర్ పర్సన్ వి నాగలక్ష్మి మాట్లాడుతూ బడ్జెట్ ఆరోగ్య రంగంలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రి మౌలిక సదుపాయాలను ఉపయోగించడం స్వాగతనీయమని అన్నారు. అలాగే అన్ని జిల్లా ఆసుపత్రులలో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయడం శ్లాఘనీయమని చెప్పారు.


వి. నాగలక్ష్మి

ప్రెస్ మీట్‌లో పాల్గొన్న వారు బడ్జెట్ మధ్యతరగతికి ఆర్థిక ఉపశమనం కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ దేశ ప్రగతికి దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

శరణం నరేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్, సీఐఐ, ఏపీ.


సస్టైనబుల్ ఇంప్రువ్ గ్రోత్ కు సంబంధించిన బడ్జెట్. కేంద్రం అన్ని రకాలుగా ఆలోచించి ప్రవేశపెట్టిన బడ్జెట్. చాలా బాగుంది. ఏపీలో ప్రతి జిల్లాకు ఒక ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంఎస్ ఎంఈలకు ఇన్ సెంటివ్స్ ఇస్తున్నారు. దీని వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల స్కిల్ పెరుగుతుంది. ప్రజల అభివృద్ధికి ఉపయోగ పడే బడ్జెట్.

Read More
Next Story