Tirumala || యూపీఐ ద్వారా పేమెంట్ చేసి లడ్డూలు పొందే అవకాశం
లడ్డూల కోసం ఇకపై క్యూ కట్టాల్సిన పని లేదు;
తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లో టీటీడీ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయి నుంచి రూ.99 వేల వరకు భక్తులు సులభంగా విరాళాలు అందజేసేలా టీటీడీ తొలుత ఈ కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో లడ్డూలకూ విస్తరించి, ఐదు కియోస్క్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్లు, టోకెన్లపై ఉండే నెంబరును భక్తులు ఈ కియోస్క్లో నమోదు చేసి లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకోవాలి.
10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. ఆ తర్వాత కనిపించే కోడ్ను భక్తులు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తే ఓ రసీదు వస్తుంది. దాంతో నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూలు పొందవచ్చు. ఎలాంటి దర్శన టోకెన్లు, టికెట్లు లేని భక్తులైతే తమ ఆధార్ నెంబరును నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు.
లడ్డూల నిల్వ, రద్దీని బట్టి ఈ సంఖ్య మారుతుంటుంది. కొద్ది రోజులు ఈ విధానాన్ని కొనసాగించి లోటుపాట్లను సరిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.