తిరుమల దారిలో ఎయిర్ పోర్ట్ మాదిరి లగేజీ స్కానింగ్

కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు 5,000 టోకెన్లు జారీ.;

Update: 2025-06-07 14:34 GMT

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు. టిటిడి ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచియుండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చు, మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చునని అన్నారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు మరియు ఆరు చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లలో స్కానింగ్ చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టిటిడి ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా, సమయానికి, వేగంగా, భద్రంగా లగేజీని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చాం - టిటిడి ఈవో
శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురౌతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్ కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు సరాసరి 5,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రతా ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కాలినడకన శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తులతో టిటిడి ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం భక్తులకు టోకెన్లు జారిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడుగగా, భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సమీక్ష అనంతరం టిటిడి ఈవో జె శ్యామల రావు ఉన్నతాధికారులతో కలసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు జారీని పరిశీలించి, భక్తులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వి. వీరబ్రహ్మం, సివిఅండ్ ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, సిఈ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News