Tirumala || తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.;
By : Dinesh Gunakala
Update: 2025-06-22 04:47 GMT
తిరుమలలో వరుసగా ఐదో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ. ఇప్పుడిప్పుడు పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో. తమ పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్ధీ మరోసారి భారీగా పెరిగిపోయింది.
తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తడంతో. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి. శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే శనివారం రోజు శ్రీవారిని రికార్డు స్థాయిలో 90,087 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిలో 41,891 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా. హుండీ కానుకల ద్వారా 4.3 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.