హైదరాబాద్ యాచక రహిత నగరంగా మారేనా? జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయనున్నారా? అంటే అవునంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. యాచకులను ఇక షెల్టర్ హోంలకు, వారి ఇళ్లకు పంపించేందుకు డ్రైవ్ చేపట్టారు.;

Update: 2025-06-26 13:36 GMT
యాచకురాలిని తరలిస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు

హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు, దేవాలయాలు, పార్కులు, ఫుట్ పాత్ లపై బిక్షగాళ్లు దర్శనమిస్తున్నారు. ఏ చౌరస్తా చూసినా ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు యాచకుల గుంపు వాహనచోదకులను చుట్టుముడుతుంటుంది.


స్నైల్ పైలెట్ ప్రాజెక్టు విఫలం
కేంద్రసామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ బిచ్చగాళ్ల పునరావాసం కోసం స్మైల్ పథకాన్ని తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోని ఢిల్లీ, ముంబయి, పాట్నా, ఇండోర్, చెన్నై, బెంగళూరు, నాగపూర్, లక్నో, అహ్మదాబాద్ లలో బిక్షగాళ్ల జీవనోపాధి, పునరావాసం కోసం కేంద్రం పైలెట్ ప్రాజెక్టు చేపట్టినా బెగ్గర్స్ సమస్య తీరలేదు. స్నైల్ పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరంలోని బిక్షగాళ్ల వివరాలను సేకరించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినా బెగ్గర్ ఫ్రీ సిటీ కాలేదు.

షెల్గర్ హోంలకు యాచకుల తరలింపు
గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రధాన కూడళ్లలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్ లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మూడు రోజులుగా చేపట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలమేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలోని బషీర్ బాగ్, సెక్రటేరియేట్, నాంపల్లి, బేగంబజార్ ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద ఉండే యాచకులు,ఫుట్ పాత్ లపై ఉండే వారిని గుర్తించి జీహెచ్ఎంసీ నిర్వహించే షెల్టర్ హోమ్ లకు తరలించారు.

యాచకులకు కౌన్సెలింగ్
నగరంలోని కొందరు యాచకులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని వారి సొంత ఊర్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత రెండు, మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాల్లో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం సేకరించి వారిని, వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్‌కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.

నగరంలో 221 మంది యాచకుల తరలింపు
నగరంలో కొద్దీ రోజులుగా యు.సి.డీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాచకుల తరలింపులో 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 మంది పిల్లలున్నారని గుర్తించారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ కు తరలించగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్ పాత్ లపై ఉండేవారిని షెల్టర్ హోమ్ లకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యు.సి.డీ అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.యాచకుల తరలింపునకు పోలీసు సహకారం కూడా తీసుకుంటున్నారు.


Tags:    

Similar News