తెలంగాణలో వరద నష్టం అంచనా రూ.10,320కోట్లు

భారీ వర్షాలు,వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-13 15:02 GMT

తెలంగాణలో వరద బాధితులు,ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని ఆయన కోరారు.

- తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు.
- ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లను నిర్ణయించారని.. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

కేంద్రానికి వరద నష్టం నివేదిక
తెలంగాణలో వరద నష్టం 10,320.72కోట్లుగా రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. భారీవర్షాలు, వరదల వల్ల రూ.231.13 కోట్లు అని తేలింది. రోడ్డు భవనాలశాఖ, పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ రోడ్డ మరమ్మతుకు రూ.7693.53కోట్లు,విద్యుత్ శాఖకు రూ.179.88కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.483.00కోట్లు, మంచినీటి సరఫరా కోసం రూ.331.37 కోట్లు,అర్బన్ డెవలప్ మెంట్ కు రూ.1216.57కోట్ల మేర నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు.

కేంద్ర బృందానికి నష్టం వివరాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రబృందానికి వివరించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెర్వులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు.రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

మున్నేరు వాగు వద్ద రిటైనింగ్ వాల్
ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

వరద సహాయ పనులకు పోలీసు బెటాలియన్లు
భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నపోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని అన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని అన్నారు.

మేడారం అడవుల్లో 50వేల చెట్లు నేలమట్టం
మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సీఎం సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాంటి సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు.

కేంద్రబృందం పర్యటన
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడిపోయి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. ఎన్​డీఎంఏ సలహాదారు కల్నల్​ కేపీ సింగ్​ సారధ్యంలో ని ఈ బృందంలో కేపీ సింగ్​ తో పాటు శాంతినాథ్​ శివప్ప, మహేష్​ కుమార్​, నాయల్​ కాన్సన్​, రాకేష్​ మీనా, శశివర్ధన్​ రెడ్డి ఉన్నారు.


Tags:    

Similar News