మన్మోహన్ సింగ్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. ఈ సభను స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై సంతాప తీర్మానంతో ప్రారంభించారు.;

Update: 2024-12-30 06:25 GMT

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. ఈ సభను స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై సంతాప తీర్మానంతో ప్రారంభించారు. అనంతరం ఈ తీర్మానంపై లీడర్ ఆఫ్ ది హౌస్ రేవంత్ రెడ్డిని మాట్లాడాలని కోరారు. స్పీకర్ అనుమతి మేరకు ప్రసంగం ప్రారంభించిన సీఎం రేవంత్.. పలు కీలక డిమాండ్లు చేశారు. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన విగ్రహం పెట్టాలని తీర్మానించారు. దేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న సమయంలో దేశ పగ్గాలు స్వీకరించిన మన్మోహన్ సింగ్.. ఎంతో చాకచక్యంగా దేశాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు రేవంత్.

ఆ ఘనత మన్మోహన్‌దే

‘‘ఉపాధి హామీ పథకం తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌ది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని శాసన సభ తీర్మానం. నీతి నిజాయితీ అంటే మన్మోహన్ సింగ్. పని చేయడం తప్ప వేరే ఆలోచనలు లేని గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక అంశాల్లో ఆదర్శంగా తీసుకోవాలంటే మన్మోహన్ సింగ్ ఒక్కరే. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడంలో ఎల్లప్పుడూ పాటుపడే వ్యక్తి ఆయన. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కొత్త సభ్యులైన మాతో నిరసన చేశారు. 2013 భూ సేకరణ చట్టం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చట్ట సవరణ ద్వారా పేదలు లబ్ధి పొందారు. తెలంగాణ అంటే మన్మోహన్ సింగ్ కి ప్రత్యేక అభిమానం. తెలంగాణకి ఆయన ఆశీస్సులు ఉంటాయని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్‌యూ వరకు మన్మోహన్ సింగ్ పై ఏకాభిప్రాయం ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ప్రజలు మన్మోహన్ సింగ్ ను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

సహనానికి ప్రతిరూపం

‘‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్’’ అని కొనియాడారు.

దేశం దశ-దిశ మార్చిన వ్యక్తి

‘‘ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్. అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయి. దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి...కానీ తెలంగాణకు ఆయన ఆత్మబంధువు. తెలంగాణకు పురుడుపోసిన వ్యక్తిగా అయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు’’ అని తెలిపారు.

ఆయన సేవలు చిరస్మరణీయం

‘‘దేశానికి మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయం. దేశానికి ఆయన చేసిన సేవలకు మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మన్మోహన్ గారి పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ గారితో జైపాల్ రెడ్డి గారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాంటి ఆయనకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యుల సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని మేం భావిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News