అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి,డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇతర కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధుల ఆదాయపు పన్ను చెల్లింపులకు వెచ్చించడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ హైకోర్టులో విచారణలో పెండింగులో ఉండటంతో ప్రజాధనంతో సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనాన్ని వెచ్చిస్తూనే ఉన్నారు. నిధుల కొరతతో నీరసించిన తెలంగాణలో మంత్రుల ఐటీ చెల్లింపులు చేయకుండా ప్రజాధనాన్ని ఆదా చేయాలని పద్మనాభరెడ్డి కోర్టును అభ్యర్థించారు.
జీతభత్యాలతోపాటు ఐటీ చెల్లింపులు కూడానా...
దేశంలోని అనేక రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా మంత్రులకు ఐటీ చెల్లించడం ఆపాలని రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రభుత్వాన్ని కోరింది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జీతభత్యాల చట్టం 1953 సెక్షన్ 3 ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ఛైర్మన్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, కేబినెట్ ర్యాంకు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుంది. దీంతో పాటు ప్రజాప్రతినిధులైనా మంత్రులకు ఇతర వ్యాపారాలు, వ్యవసాయం ద్వారా వారికి ఇతర ఆదాయం కూడా వస్తుంది.ఏ ఉద్యోగి కైనా జీతంపై అతనే తన సొంత డబ్బుతో ఇన్కం టాక్స్ చెల్లించాలి. కానీ ఈ ఆదాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో సీఎం, మంత్రుల పన్నులు చెల్లిస్తూనే ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అయినా కొన్నేళ్లుగా సాగుతోంది.
ఐటీ చెల్లింపుల బాగోతం బయటపడింది...
తెలంగాణ రాష్ట్రంలో 2015-16 వ సంవత్సరానికి గాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి సలహాదారులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ల ఆదాయపు పన్ను కింద రూ.22.51లక్షల రూపాయలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ చెల్లించింది. ఈ మేరకు 2016 మార్చి 25వతేదీన జీఓ ఆర్టీ నంబరు 917 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నాటి నుంచి 2024-25 వ ఆర్థిక సంవత్సరం వరకు సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనాన్ని వెచ్చిస్తూనే ఉన్నారు.
అప్పటి సీఎం కేసీఆర్ ఆదాయపు పన్ను రూ.15.39 లక్షలు
2016వ సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆదాయపు పన్ను కింద రూ. 15.39 లక్షలు వెచ్చించారు.అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన ఆర్ విద్యాసాగర్ రావు రూ.79 వేలు, ఏకే గోయల్ రూ.2.5 లక్షలు, ఎం రామ లక్ష్మణ్ కు రూ.93వేలు, బీవీ పాపారావుకు రూ.24వేలు, కేవీ రమణాచారికి రూ. రూ.27 లక్షలు, జీఆర్ రెడ్డికి రూ.75 వేలు, అప్పటి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఐటీ చెల్లింపులకు రూ. 1.6 లక్షల ప్రజాధనాన్ని రాష్ట్రప్రభుత్వం చెల్లించింది.మొత్తం రూ. 22.51లక్షలను ఈ ఐటీ చెల్లింపులకు హైదరాబాద్ డిప్యూటీ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రజాధనాన్ని వెచ్చించారని జీఓలో వెల్లడైంది. ఆ తర్వాత నుంచి సీఎం, మంత్రులు, సలహాదారుల ఐటీ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం బయటకు రాకుండా అత్యంత రహస్యంగా ప్రజాధనాన్ని చెల్లిస్తూనే ఉంది.
ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వని జీఏడీ
ప్రజాధనంతో సీఎం, మంత్రులకు చెల్లించిన ఆదాయపు పన్నుల సమాచారాన్ని అందజేయాలని జీఏడీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారాన్ని ఇవ్వాలని ఈ ఏడాది మే నెల 20వతేదీన కోరింది. దీనిపై తెలంగాణ జీఏడీ అధికారులు మంత్రుల ఐటీ చెల్లింపుల సమాచారాన్ని ఇవ్వలేదు. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8 (1) ప్రకారం సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపుల సమాచారం ఇచ్చేది లేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. ప్రజాధనంతో మంత్రుల ఐటీ చెల్లిస్తున్నందున ప్రజలు అడిగితే ఆర్టీఐ యాక్ట్ కింద తప్పని సరిగా సమాచారం ఇవ్వాలి. కాని ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8 (1) వర్తించకున్నా ముఖ్యమంత్రి, మంత్రులు,ఇతర క్యాబినెట్ ర్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించిన ఐటీ గురించి సమాచారాన్ని వెల్లడించడానికి ప్రభుత్వం నిరాకరించింది.
తెలంగాణలో మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనం
ఇతర రాష్ట్రాల్లో సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులు చేయడం లేదు. తెలంగాణలో మాత్రం ప్రజాధనంతో సీఎం, మంత్రుల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులు చేయరాదని ఇటీవల హర్యానా, మధ్య ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు నిర్ణయించాయి. దీంతో మంత్రులు, సీఎం వారి ఐటీని వారి సొంత డబ్బుతో చెల్లిస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వ్యర్థం కావడం లేదు. అయినా తెలంగాణలో మంత్రులకు ఐటీ చెల్లింపులను అత్యంత రహస్యంగా చేస్తూనే ఉన్నారు.
సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులు ప్రజాధనంతో చేయవద్దని గత నెల 25వతేదీన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చీఫ్ సెక్రటరీకి, జీఏడీకి లేఖ రాసినా ప్రయోజనం లేదు.సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనం వ్యర్థం చేస్తున్నారని, దీన్ని రద్దు చేయాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.