కాంగ్రెస్ లో చేరికని అడ్డుకున్న బీఆర్ఎస్ కి పోచారం స్ట్రాంగ్ కౌంటర్

మాజీ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

By :  Vanaja
Update: 2024-06-21 07:26 GMT

తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఇద్దరినీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశామన్నారు. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామన్నారు.

రైతుల సంక్షేమం కోసం అందరినీ కలుపుకుపోతాం...

తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు అని రేవంత్ చెప్పారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామన్నారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం అని రేవంత్ తెలిపారు.

ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామని సీఎం వెల్లడించారు. శ్రీనివాస రెడ్డి చేరిక శుభసూచికమన్న రేవంత్.. ఆయన సలహాలు, సూచనలతో రైతు సమస్యల పైన దృష్టి పెడతామన్నారు. "పోచారం శ్రీనివాస రెడ్డి చేరికను అడ్డుకున్నది ఎవరో నాకు ఇంకా సమాచారం రాలేదు. ఇటువంటి వాటి పైన త్వరలోనే స్పందిస్తాను. ఈరోజు రైతు రుణమాఫి పైనే దృష్టి పెట్టాము, రైతులకు శుభసూచకం జరుగుతుంది. కేబినెట్ నిర్ణయం కూడా అదే" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నేనేమీ చిన్న పిల్లోడిని కాదు... పోచారం

తానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన పరిపాలన చాల బావుంది,, మరో 20 యేండ్లు రాష్ట్రాన్ని నడిపించగల నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. తన చేరికను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతల వ్యవహారంపై స్పందిస్తూ... తెలుగుదేశం నుండీ బిఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు బిఆర్ఎస్ నాయకులకు తెలియదా.. అని పోచారం నిలదీశారు. "నేనేమీ చిన్న పిల్లోడిని కాదు, నా పుట్టుకనే కాంగ్రెస్ పార్టీ. నా ఇష్ట ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన.." అని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన పార్టీ మారేందుకు వీల్లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుద్దామని ఇంటికి వెళ్లిన బాల్క సుమన్ ని, ఆందోళన చేపట్టిన శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News