గురుకుల భవన యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్.. కేసులు తప్పవంటూ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు ఈరోజు తాళాలు పడ్డాయి. అద్దె బకాయిలు ఉన్న కారణంగా గురుకుల భవన యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-10-15 11:08 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు ఈరోజు తాళాలు పడ్డాయి. అద్దె బకాయిలు ఉన్న కారణంగా గురుకుల భవన యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలని, చెల్లింపు పూర్తికాగానే తాళాలు తెరుస్తామని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేటు భవన యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఇప్పటికే మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాఠశాలల భవనాల అద్దెలు కూడా కట్టలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. మూసీకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారంటూ ప్రశ్నించారు హరీస్ రావు. ‘‘ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనం. ముఖ్యమంత్రి సారు.. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు.. ఇంకెప్పుడు పట్టించుకుంటారు?’’ అని ప్రశ్నించారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవన యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారు తాళాలు తొలగించకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

అందరిపై క్రిమినల్ కేసులు పెట్టండి: పొన్నం

గురుకులాలకు తాళాలు వేయడంపై రవాణా శఆఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయని, గత కొన్నేళ్లుగా అద్దె బకాయిలు అడిగే ధైర్యం చేయలేకపోయింది కాగా.. ఇప్పుడు రేపో మాపో నిధులు మంజూరు చేసే సమయంలో ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ఎవరో అంటున్న మాటలను పట్టుకుని ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని ఆయన గురుకుల భవన యజమానులకు సూచించారాయన. బకాయిలను చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రతి ఒక్కరికీ బకాయిలను ఇప్పించే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు.

యజమానులు లొంగుతారా..

పొన్నం ప్రభాకర్ ఒకవైపు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు భరోసా కల్పించడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇప్పుడు గురుకుల భవన యాజమానులు ఏం చేస్తారన్నది చర్చనీయాంశమైంది. వార్నింగ్ భయపడో, భరోసాను నమ్మో వారు లొంగుతారా? తాళాలు తీస్తారా? మళ్ళీ పాఠశాలల కొనసాగింపుకు బకాయిలు అందకముందే ఓకే చెప్తారా? అన్న అనుమనాలు తీవ్ర చర్చల్లో నిలుస్తున్నాయి. లేకుంటే బకాయిలు చెల్లించకపోగా.. ఎదురు వార్నింగ్‌లు ఇవ్వడంపై వాళ్లు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. కాగా గురుకులాలకు తాళాలు వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కూడా గేట్ల బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. పైగా వారు తాళాలు వేసి.. గేటును తమ బాధ అర్థం చేసకోవాలంటూ ఓ వాల్ పోస్టర్ కూడా అంటించడం కీలకంగా.

పోస్టర్‌లో ఏముందంటే..

‘మార్చి నెల నుంచి గురుకుల భవనాలకు నెల వారి అద్దె చెల్లించనందున, కొన్ని గురుకులాల్లో 30 నెలలకు పైగా అద్దె బకాయిలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక సార్లు కమిషనర్ స్థాయిలో వినతి పత్రాలు ఇచ్చినా ఏ విధమైన స్పందన లేదు. దాంతో ఇప్పటికే ఇచ్చిన నోటీసు ఆధారంగా నేడు మా భవనాలకు తాళాలు వేసుకుంటూ బకాయి చెల్లించిన తర్వాతే తాళం తీస్తాం. అసౌకర్యానికి చింతిస్తూ.. మా బాధలు అర్థం చేసుకోగరని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి’’ అని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News