కన్నడ నటుడు దర్శన్కు షాక్..
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు..;
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్(Darshan)కు కర్ణాటక(Karnataka) హైకోర్టు(High court) మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే కేసులో నటి పవిత్రా గౌడ, మరో ఐదుగురికి కూడా బెయిల్ రద్దయ్యింది.
33 ఏళ్ల తన అభిమాని రేణుకస్వామిని హత్యచేశాడన్న ఆరోపణలతో దర్శన్ను జూన్ 11, 2024న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స కోసం దర్శన్కు ఆరు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 13, 2024న ఆయనతో పాటు పవిత్ర గౌడ, మరో ఐదుగురికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత(Supreme court) న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. దీన్ని విచారించిన జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్తో కూడిన ధర్మాసనం జూలై 24న తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు (ఆగస్టు 14) తీర్పు వెలువరించింది. బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవంటూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
ఇంతకు కేసేమిటి?
దర్శన్ స్నేహితురాలయిన నటి పవిత్ర గౌడ(Pavithra Gowda)కు ఆయన అభిమాని అయిన చిత్రదుర్గకు చెందిన ఆటో డ్రైవర్ రేణుకాస్వామి (Renukaswamy)(33) అసభ్యకర సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్కు చెప్పడంతో ఆయన పథకం ప్రకారం రేణుకాస్వామిని హత్య చేశారు. దర్శన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘ సభ్యుల్లో ఒకరైన రాఘవేంద్ర.. రేణుకస్వామికి ఫోన్ చేసి ఆర్ఆర్ నగర్లోని ఓ షెడ్డుకు పిలిపించాడు. అక్కడే రేణుకస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న కాలువ దగ్గర రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్టులో పేర్కొన్నారు.