రాజ్యసభకు నామినేషన్ల దాఖలు.. అభ్యర్థులెవరంటే..

DMK నుంచి నలుగురు, AIADMK నుంచి ఇద్దరు..;

Update: 2025-06-07 10:44 GMT

రాజ్యసభ(Rajya Sabha)కు డీఎంకే(DMK) అభ్యర్థులు తమ నామినేషన్లను శుక్రవారం అసెంబ్లీ అదనపు కార్యదర్శి, రిటర్నింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో సినీనటుడు, మక్కల్ నీది మలమ్ (MNM) పార్టీ చీఫ్ కమల్ హాసన్(Kamal Haasan) తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కమల్‌తో పాటు డీఎంకే తరుపున సీనియర్ న్యాయవాది పి. విల్సన్, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శివలింగం, ప్రముఖ తమిళ కవి కవింగర్ సల్మా కూడా నామినేషన్లు అందజేశారు.

AIADMK నుంచి..

ఇక పత్రిపక్షం అన్నాడీఎంకే నుంచి ఐఎస్ ఇంబాదురై (అడ్వకేట్ వింగ్ కార్యదర్శి), మాజీ ఎమ్మెల్యే, పార్టీ చెంగల్పేట్ తూర్పు జిల్లా ప్రిసీడియం చైర్మన్ ఎం ధనపాల్ తమ నామినేషన్లను సమర్పించారు.

ఇప్పటికే DMK జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. మొత్తం ఆరు స్థానాల్లో DMKకు 4 , ప్రతిపక్ష AIADMKకు 2 సీట్లు ఉన్న విషయం తెలిసిందే.

డీఎంకే అభ్యర్థుల గురించి..

1) పి. విల్సన్: ఈయన సీనియర్ న్యాయవాది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయనను మళ్లీ నామినేట్ చేసి పార్టీ ప్రాతినిధ్యాన్ని కొనసాగించింది డీఎంకే.

2) ఎస్.ఆర్. శివలింగం: మాజీ ఎమ్మెల్యే అయిన సేలం తూర్పు జిల్లా కార్యదర్శి కూడా. సేలం ప్రాంతంలో బలమైన వ్యక్తిగా పేరున్న మాజీ మంత్రి వీరపాండియన్ అనుచరుడు. శివలింగం ఉదయార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం ఓట్లు కలిసివస్తాయని డీఎంకే భావిస్తోంది.

3) రచయిత్రి కవింగర్ సల్మా: ఈమె ప్రఖ్యాత తమిళ కవయిత్రి. మేథావులు, కళాకారుల ఓట్లను రాబట్టుకునేందుకు ఈమెను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.

4) MNM చీఫ్ కమల్ హాసన్

హామీ నిలబెట్టుకున్న డీఎంకే..

2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అద్భుతమైన విజయం సాధించింది. భారత కూటమిలో భాగమైన డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులోని మొత్తం 39 స్థానాలను, పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలో మక్కల్ నీది మలమ్ (MNM) పోటీచేయకపోగా డీఎంకే కూటమి తరుపున విస్తృత ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎంఎన్ఎమ్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని కమల్‌కు డీఎంకే హామీ ఇచ్చింది.

వైకోను ఎందుకు పక్కనపెట్టారు?

మారుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) నాయకుడు వైకో రాజ్యసభ పదవీకాలం జూలై 2025తో ముగుస్తుంది. ఈ సారి ఈయనను పక్కన పెట్టడం వల్ల DMK కూటమిలో మళ్లీ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈయన 2019 నుంచి ఎంపీగా ఉన్నారు. కూటమికి MDMK బాగానే సహకరించినా.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణ ఓటర్లను ఆకర్షించడం కోసం MNMకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో వైపు టీవీకే చీఫ్ విజయ్‌ను ఎదుర్కోడానికి కమల్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. విజయ్‌ను ఎదుర్కోవడానికి పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అవసరమని భావించి డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తిరిగి నామినేట్ కావడానికి వైగో చేసిన లాబీయింగ్ సఫలం కాలేదన్న వార్తలొస్తున్నాయి.

పొత్తుకు కట్టుబడి ఉన్నాం..

వైకోను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో MDMK డీఎంకేతో గతంలోలాగా కలిసి ఉంటారా? లేక విడిపోతుందా? అన్న సందేహం తలెత్తింది.

ఈ విషయంపై ఆ పార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పార్టీ వ్యవస్థాపకుడు వైకో కుమారుడు దురై వైకో స్పష్టతనిచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోనూ అధికార డీఎంకేతో తమ పొత్తు కొనసాతుతుందని ధృవీకరించారు.

జూన్ 2న నోటిఫికేషన్..

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి జూన్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 9. 10వ తేదీ నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 12వ తేదీ. జూన్ 19 పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

Tags:    

Similar News