శ్రీశైలంలో శివాజీకి మొక్కి, ధ్యానం చేసి..

మల్లన్న స్వామి వార్ల దర్శనంలో భాగంగా రుద్రాభిషేకం, కుంకుమార్చనలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Update: 2025-10-16 10:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి గురువారం శ్రీశైలం పర్యటనకు వచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. మొదట స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన మోదీ అనంతరం భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

 అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు. ఆలయ వేద పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలు అలాగే చిత్రపటాన్ని మోదీకి ఆలయ అధికారులు అందించారు. మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని ప్రదానం చేశారు. ప్రధానమంత్రికి ఆలయ విశేషాలను అధికారులు తెలియచేశారు. సుమారు గంట సేపు ప్రధాని ఆలయంలో గడిపారు.

శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్ర సందర్శన

శ్రీశైలంలోనే ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని శ్రీశైలం పర్యటనలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న అతి పెద్ద శివాజీ చిత్రానికి మోదీ నమస్కరించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు మోదీకి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలు సమర్పించి నమస్కరించారు. కేంద్రం నిర్వహణ వివరాలు తెలుసుకొని నిర్వాహకులు అభినందించారు.

Tags:    

Similar News