జగన్ ఓదార్పు యాత్రల వెనక వ్యూహం ఏమిటి?
జగన్ ‘ఎమోషనల్’ మార్గం ఎందుకు ఎంచుకున్నాడు?;
జగన్ పలావు పెట్టేవాడు. అధికారంలోకి వస్తే బిర్యానీ పెడతాడని చంద్రబాబు చెప్పారు. జనం నమ్మి జనం ఓట్లేశారు. కానీ ఇప్పుడు రెండూ పోయాయంటున్నారు మాజీ సి.ఎం. జగన్.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చిందనేది ఆయన అభిప్రాయం. అయితే ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారుతుందా? అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అలవాటు ప్రకారం జగన్ పరామర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా వుంటే పార్టీ బతికేదెప్పుడని మంగళగిరి ప్యాలెస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి .‘ఓదార్పు’ అలవాటులో భాగంగా పరామర్శలకు వెళ్తున్నారు. తెనాలి వెళ్ళాడు. పల్నాడు వెళ్లాడు.అశించిన మైలేజ్ ఫలితం రాలేదు . అనుమతులు లేవంటూ కేసులు బుక్ అయ్యాయి. ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టడం లేదనేది గత ఏడాదిగా మనం చూస్తున్నాం. ఎందుకు?
రాష్ట్రంలో సమస్యలు లేవా? సూపర్ సిక్స్ గురించి ప్రస్తావిస్తూ జనంలోకి జగన్ ఎందుకు వెళ్ళడం లేదు. 1. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా అందజేశారు. 2 ''తల్లికి వందనం'' పథకం ద్వారా స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ15వేలు. గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు. ఈ ఏడాది నుంచి జూన్ 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే రూ15వేలు బదులు రూ.13వేలు ఇస్తున్నారు. 3. ప్రతి రైతుకు ఏడాదికి రూ20వేల పెట్టుబడి (ఆర్థిక) సాయం. గతేడాది ఇవ్వలేదు. ఇప్పటివరకూ ఈ పథకం అమలు కాలేదు. 4. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి. యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. 5. ప్రతి మహిళకు నెలకి రూ 1500. ఈ హామీ గురించి కూడా ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. 6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే మాజీ సిఎం కు ఈ అంశాలు కనిపించడం లేదు.
తన అలవాటు ప్రకారం పరామర్శలకు మినహా ప్రజా సమస్యల పై జగన్ బయటకు రావడం లేదు. కేవలం ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పార్టీ నేతల సమావేశాల్లో ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇస్తున్నారు. జగన్ బయటకు వచ్చి.. రాష్ట్రంలో పర్యటిస్తూ భారీ ధర్నా నిర్వహించాలని క్యాడర్ కోరుకుంటోంది. అయితే జగన్ ఇంకా సమయం ఉందనే ధోరణితో వ్యవహరిస్తున్నారా? జగన్ నమ్మిన నేతలే జగన్ కు ఇప్పుడే ప్రజల్లోకి వద్దని సలహాలు ఇచ్చి ఆపుతున్నారట. ఎందుకు?
జగన్ వ్యక్తిత్వం ప్రకారం చూస్తే ఎవరో చెప్పడం ఏమిటి, తాను చేసేదే రాజకీయం అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కిందకు దిగలేదు. ప్రమాద ఘంటికలు వచ్చినా థర్టీ ఇయర్స్ నేనే సీఎం అని చెప్పుకున్నారు. చివరికి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ కే ప్రమాదం ఏర్పడింది. అయినా ఆయన ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. చూస్తూ చూస్తూనే ఏడాది గడిచిపోయింది.
జగన్ ఏం నేర్చుకున్నారు?
ఈ ఏడాదిలో వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. కాస్త కోలుకున్నామని అనుకునే లోపే జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓ వైపు కేసులు, మరోవైపు స్కాముల ఆరోపణలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతోంది. లిక్కర్ స్కామ్ జగన్ మెడకు చుట్టుకుంది. జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులే జైలుకు పోవాల్సిన పరిస్థితి. వల్లభనేని వంశీ కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. రజినీ నుంచి కొడాలి దాకా... రోజా నుంచి పోసాని రాజా దాకా అందరిపై కేసుల కత్తి వేలాడుతోంది.
అధికారంలో వున్నప్పుడే వైసీపీ కేడర్కు అన్యాయం జరిగిందని, ఇకపై అలా జరగదనే ఒకే ఒక్క మాట ఇంత వరకూ జగన్ నోటి నుంచి రాలేదన్న ఆవేదన క్యాడర్లో వుంది.
జగన్ పరామర్శల బాట పట్టేందుకు కారణం ఏమిటి?
క్షేత్రస్థాయిలో కేడర్ యాక్టివ్గా లేకపోతే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం కావు. అటు ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులు కొందరు రాజీనామా చేశారు. మరికొందరు వేరే పార్టీల్లోకి వెళ్లారు. చాలా మంది మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెడుతున్నది. అరెస్టు చేస్తున్నది. ఇలానాయకులంతా ముందస్తు బెయిల్, బెయిల్ కోసం, జెయిల్ నుంచి బయటకు వచ్చేందుకో కోర్టుల చుట్టూర తిరుగుతున్నారు.
ఇప్పుడు మిగిలింది కార్యకర్తలే. వీళ్లని కాపాడుకోవాలి. ఇందుకోసమే జగన్ ప్రభుత్వంతో తగాదా మార్గం కాకుండా భావోద్వేగం మార్గం పట్టారు.అంటే ఎమోషనల్ రూట్ తీసుకున్నారు. ఇది కార్యకర్తలో నాయకుడి మీద గౌరవం పెంచుతుంది. ఓడిపోయాక జగన్ తమిన మర్చిపోలేదనే భరోసా ఇస్తుంది. కార్యకర్తకులకు పార్టీకి మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. అందుకే జగన్ ఎమోషనల్ బాట పట్టాడని పార్టీకి చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వంతో ప్రజా సమస్యల మీద పోరాడేందుకు ఆందోళన బాట పడితే చాలా నష్టం ఉంది. వైసిపి అభిమాని అనే వాడినల్లా నిరుత్సాహ పరిచనేందుకు టిడిపి ప్రయత్నిస్తూ ఉంది. ఏమారితే చాలు పోలీసులు కేసులు పెడుతున్నారు. ఆందోళన బాటపడితే వేలది కార్యకర్తల మీద విజయనగరం జిల్లా నుంచి అనంతపురం దాకా కార్యకర్తలమీద కేసులు పెడతారు. అపుడు ఈ కేసుల కోసం స్టేషన్ల చుట్టూ, కోర్టు లచూట్టు తిరుగుతుంది. పార్టీ వారినందరిని కాపాడే స్థితిలో లేదు. అందుకే వాళ్లను కాపాడుకునేందుకు జగన్ శాంతియుతంగా ఓదార్పు యాత్రచేపట్టారు. దీనికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి," అని పేరు చెప్పేందుకు ఇష్టపడిని వైసిపి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
తను ఆవేశానికి లోనయి, కార్యకర్తలను బయటకు లాగి తెలుగుదేశం పార్టీ వేధింపులరు వారు గురికాకుండా ఉండేందుకు జగన్ జాగ్రత్తగా నడుచుకుంటున్నారని మరొక నాయకుడు చెప్పారు. ఇపుడున్న పరిస్థితులో కార్యకర్తలను కాపాడుకోవడమే జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ వ్యూహం ముందుముందు బాగా పనికొస్తుందని ఆయన అన్నారు.