అప్పుల కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి

రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి మరీ తాకట్టు పెట్టడం, అప్పలు చేయడం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై జగన్‌ మండిపడ్డారు.;

Update: 2025-06-26 11:49 GMT

ప్రభుత్వ ఆస్తులను అడ్డుగోలుగా తాకట్టు పెట్టి ఎడాపెడా అప్పులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి తెస్తున్న డబ్బులతో ఏమి చేస్తున్నారు? ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ఆయన నిలదీశారు. ఆ మేరకు సోషల్‌ మీడియా వేదికగా గురువారం కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మరో సారి రాజ్యాంగాన్ని, నిబంధనలను ఉల్లంఘించారని, భారీ ఎత్తున అప్పులు చేస్తోందని మండిపడ్డారు. ఏపీఎండీసీ ద్వారా బుధవారం కూడా మళ్లీ బాండ్లు జారీ చేశారని ధ్వజమెత్తారు. రూ. 9వేల కోట్ల కోసం రూ. 1,91,000 కోట్ల విలువైన ఏపీఎండీసీ గనులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండీసీ) ద్వారా రెండో విడత కింద 2025 జూన్‌ 25 బుధవారం నాడు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ బాండ్లు) జారీ చేసిందని, దాదాపు 9.30 శాతం అధిక వడ్డీ కింద సుమారు రూ. 5,526 కోట్లు అప్పులు చేసిందని జగన్‌ విమర్శలు గుప్పించారు. దీంతో ఎన్‌సీడీ బాండ్ల విలువ మొత్తం కలిపి రూ. 9వేల కోట్లకు చేరిందని, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పాలని సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ తతంగానికి సంబంధించిన వ్యవహారం అంతా ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టులో ఉందని, ఇటీవల నోటీసులు కూడా జారీ అయిన సంగతిని జగన్‌ గుర్తు చేశారు.
అప్పులు చేయడంలోను, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలోను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండానే ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు తీసుకునే వెసులు బాటు కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 203, 204, 293లను పూర్తిగా ఉల్లంఘించమే అవుతుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎన్‌సీడీ బాండ్లకు అదనపు హామీగా ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ప్రజల ఖనిజ సంపదను కేవలం రూ. 9వేల కోట్ల బాండ్ల కోసం తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ మొత్తంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి నిధులు తీసుకునేందుకు వీలుగా అనుమతులివ్వడం దారుణమని పేర్కొన్నారు. తమ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో కేంటే 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చేసిన అప్పులు 50 శాతానికిపైగా ఉన్నాయని జగన్‌ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టడం, భారీ ఎత్తున అప్పులు చేయడం రివాజుగా మారిందని జగన్‌ ధ్వజమెత్తారు.

Tags:    

Similar News