దాడులతో మా గొంతు నొక్కలేరు : జగన్‌

పథకం ప్రకారమే టీడీపీ మూకలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని మాజీ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.;

Update: 2025-07-09 05:31 GMT

వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే దురుద్దేశంతోనే టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్‌గా చేసుకుని ఆ నేత ఇంటిపై దాడి చేయడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పడూ చూసి ఉండమన్నారు.

తన చిత్తూరు జిల్లా పర్యటన, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల సమస్యలు ప్రజల దృష్టిలో పడకుండా చేయడానికే పథకం ప్రకారం ఈ వివాదాన్ని సృష్టించారని, దానిని అడ్డం పెట్టుకుని ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడి, ఇదే అంశంపై రాష్ట్రప్రజలంతా మాట్లాడుకునేలా చేయాలనేదే టీడీపీ ప్లాన్‌ అని జగన్‌ మండిపడ్డారు. ఈ ముసుగులో ప్రజా సమస్యలు బయటకు రాకుండా చేయాలనేదే టీడీపీ కుట్రని సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ ధ్వజమెత్తారు.

జగన్‌ ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి. అంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News