‘వెన్నుపోటు’ పోస్టర్‌ ఆవిష్కరణ

వైసీపీ మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.;

Update: 2025-05-30 11:11 GMT

ఎన్నికల సమయంలో కూటమి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందారని వైసీపీ రాష్ట్ర సమయన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. హామీల పేరుతో ప్రజల చేత ఓట్లు వేయించుకుని తర్వాత వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో జూన్‌ 4న ‘వెన్నుపోటు’ దినం పేరుతో నిరసనల కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించిందని వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టరును ఇతర నేతలతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

మోసపూరిత హామీలిచ్చి ఓటర్లను, ప్రజలను కూటమి, ïసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు మోసం చేశారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా ఆలోచనలు చేయకుండా చంద్రబాబు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జూన్‌ 4న వెన్నుపోటు దినంతో సీఎం చంద్రబాబు కళ్లు తెరిపిస్తామన్నారు. చంద్రబాబు, కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి నాడే జగన్‌ స్పందంచారని, అమలు కాని హామీలను వాళ్లు ఇస్తున్నారని, అమలు చేసే ఉద్దేశం వాళ్లకు లేదని ఎన్నికల సమయంలోనే జగన్‌ ప్రజలకు చెప్పారని అన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబే వాటిని అమలు చేయడం చాలా కష్టమని, పెద్ద ఎత్తున డబ్బు కావాలని చెప్పినట్లు సజ్జల గుర్తు చేశారు.
ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు సంపసృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు పీ–4 అంటూ కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు దేశంలో ఎక్కడా కనిపించవని ఎద్దేవా చేశారు. 1995లో సొంత మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో కూడా హామీలపై అబద్దాలు చెప్పారని, ఇప్పుడు అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నారని సజ్లల మండిపడ్డారు. తొలి ఏడాదిలోనే రూ. 1.49 కోట్లు అప్పులు చేశారని, ఆ సొమ్మును దేనికి ఎంత ఖర్చు పెట్టారో కూడా ఎవరికి తెలియడం లేదన్నారు. నాడు సొంత మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే నేడు తమను నమ్మి ఓటేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News