రొయ్యల రైతులకు ఊహించని విపత్తు

ఏపీలో వైరస్ వల్ల రెండు నెలల్లో సుమారు రూ. 60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయాయి.;

Update: 2025-06-26 14:21 GMT

ఏపీలో రొయ్యల పరిశ్రమ కుదేలైంది. వనామి రొయ్యల సాగు చేస్తున్న రైతులకు సీడ్‌ దశలో షాక్‌ తగులుతోంది. చెరువులో సీడ్‌ వేసిన నెల రోజులకే వైరస్‌ సోకి రొయ్యలు చనిపోతున్నాయి. రెండు నెలల్లో సుమారు రూ. 60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయినట్లు రొయ్యల రైతులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రొయ్యలు వైరస్ కు గురైనట్లు రొయ్యల రైతులు తెలిపారు. ఏపీలో 2.80 లక్షల హెక్టార్లలో రొయ్యల పెంపకం సాగవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ఎగుమతులపై ఎప్పుడైతే దెబ్బపడిందో అప్పటి నుంచి రొయ్యల రైతులపై కోలుకోలేని దెబ్బ పడింది.

భారతదేశ రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 73 శాతంగా ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద రొయ్యల ఎగుమతి రాష్ట్రంగా చెప్పొచ్చు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో రొయ్యల పెంపకం రంగం వైరస్ ల వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వ్యాధుల వల్ల సుమారు రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

రొయ్యలకు సోకుతున్న వ్యాధులు

1. ఎంటెరోసైటోజూన్ హెపాటో పెనాయ్ (EHP): ఈ మైక్రోస్పోరిడియన్ పరాన్నజీవి రొయ్యల జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఎదుగుదల లోపిస్తుంది. రొయ్యలు నీరసంగా మారతాయి. EHP వల్ల సంవత్సరానికి రూ. 4,000 కోట్ల నష్టం సంభవిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అంచనా వేసింది. ఈ వ్యాధి వల్ల సుమారు 49,000 మెట్రిక్ టన్నుల రొయ్యలు చనిపోతున్నాయి.

2. వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV): ఈ వైరల్ వ్యాధి ఒక్కో హెక్టారుకు 2.58 టన్నుల ఉత్పత్తి నష్టాన్ని కలిగిస్తుంది. WSSV 8 శాతంగా ఉంది. ఇది సుమారు 0.33 మిలియన్ టన్నుల ఉత్పత్తి నష్టానికి, రూ. 1,670 కోట్ల ఆదాయ నష్టానికి దారితీస్తోంది.

3. లూస్ షెల్ సిండ్రోమ్ (LSS), వైట్ ఫీకల్ సిండ్రోమ్ (WFS): ఈ వ్యాధులు రొయ్యల నాణ్యతను దిగజార్చి, మార్కెట్ విలువను తగ్గిస్తున్నాయి. ఫలితంగా ఎగుమతులు తిరస్కరిస్తున్నారు.

4. రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ (RMS), విబ్రియోసిస్: బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఇతర కారణాల వల్ల రొయ్యల మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కో హెక్టారుకు 0.97–1.1 టన్నుల ఉత్పత్తి నష్టం జరుగుతోంది.

ఆందోళనలో రైతులు

కైకలూరు, భీమవరం, ఇతర ప్రాంతాల్లో రొయ్యల మరణాల రేటు అధికంగా ఉంది. ఇది రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎం నాగేంద్ర బాబు అనే రైతు మాట్లాడుతూ వారానికి రూ. 12,000 వరకు మందులపై ఖర్చు చేస్తున్నాం. అయినప్పటికీ రొయ్యల ఎదుగుదల లేదని, వైరస్ తో చనిపోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

రొయ్యల ఆహారం, విత్తనాలు, విద్యుత్ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల 100 కౌంట్ రొయ్యలు కిలో ఉత్పత్తి ఖర్చు రూ. 220కి చేరగా, మార్కెట్ ధర రూ. 190కి పడిపోయిందని రొయ్యల రైతు గోరంట్ల కోటిలింగం తెలిపారు. ఫలితంగా కిలోకు రూ. 30 నష్టం వస్తోందన్నారు.

రొయ్యల చెరువుల నుంచి వచ్చే కాలుష్యం, యాంటీబయోటిక్స్ వాడకం, రసాయనాలు స్థానిక నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఇది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు.

ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ ఏమని నివేదిక ఇచ్చింది?

ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ లో ఏర్పాటు చేసిన ‘ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ’ (Aquaculture Advisory Committee) నివేదిక ఏమైందని రొయ్యల రైతులు ప్రశ్నిస్తున్నారు. 2025 ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమావేశం తర్వాత, ఏప్రిల్ 8న ఫిషరీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, రైతులు, హాచరీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

కమిటీ అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని అంచనా వేసి స్వల్పకాలిక పరిష్కారాలను సూచించాలి. రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులపై భారతదేశం, ఈక్వెడార్‌ల మధ్య అధ్యయనం చేయాలి. దేశీయ మార్కెట్‌లో రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కొత్త చర్యలు తీసుకోవాలి. నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ (NPCC) ఏర్పాటు చేయాలి. రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణ, దిగుమతి సుంకాల తగ్గింపు, క్లస్టర్ ఆధారిత విధానంతో జియోట్యాగింగ్, బ్రాండింగ్, సర్టిఫికేషన్ జరగాల్సి ఉంది. కమిటీ నివేదిక మే 1 నాటికి అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిందో వెల్లడించలేదు.

ప్రభుత్వం స్పందించాలి: జీవి సుబ్బరాజు

ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు (జీవీ సుబ్బరాజు) ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా రొయ్యలు విపరీతంగా చనిపోతున్నాయని తెలిపారు. నెల రోజుల పిల్లలు చనిపోవడం వల్ల ఎకరాకు లక్ష వరకు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. సుమారు రూ. 60 కోట్ల వరకు ఇప్పటికే నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డిలు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి రొయ్యల రైతులను ఆదుకోవాలన్నారు. అడ్వయిజరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వం వద్ద ఉందని తెలిసిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.

Tags:    

Similar News